పదాల్లో సరిగా చెప్పలేని ఎన్నో భావాలను ఎమోజీ ద్వారా చెప్పడం సోషల్ మీడియాలో ట్రెండ్. ఇప్పుడు కొత్తగా చేరిన ఓ ఎమోజీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారింది. ఏంటా ఎమోజీ అనుకుంటున్నారా? అది స్త్రీల రుతుస్రావాన్ని సూచించే ‘పీరియడ్ ఎమోజీస. చిన్న రక్తపు చుక్క ఆకారంలో ఉన్న ఆ ఎమోజీని యూకె హ్యుమానిటేరియన్ ఆర్గనైజేషన్ తీసుకొచ్చింది. ఈ సంస్థ గత కొంతకాలంగా రుతుస్రావంపై ఈ సంస్థ సోషల్ మీడియాలో విస్తృత క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. ఈ కొత్త ఎమోజీ త్వరలోనే అన్ని స్మార్ట్ ఫోన్లలో అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది.
మొత్తం 230 ఎమోజీలకు యునికోడ్ కన్సార్షియం ఆమోద ముద్ర వేసింది. అందులో ఇది ఒకటి. ఆమోదం పొందిన వాటిలో వికలాంగులకు సంబంధించిన కొన్ని ఎమోజీలు కూడా ఉన్నాయి.
రుతుస్రావం గురించి మాట్లాడటానికి, చర్చించడానికి ఇప్పటికీ వెనుకాడే సమాజంలో మార్పు కోసమే పీరియడ్ ఎమోజీని తీసుకొస్తున్నట్టు యూకె హ్యుమానిటేరియన్ సంస్థ వెల్లడించింది. ఇలాంటి ఎమోజీల ద్వారా రుతుస్రావం చుట్టూ ఉన్న విభిన్న భావనలు బద్దలవుతాయని.. దీంతో ఈ విషయంపై కూడా సాధారణ చర్చలకు ఆస్కారం ఉంటుందని సంస్థ బావిస్తోంది.
మెజారిటీ నెటిజెన్స్ సూచన మేరకు ఈ కొత్త ఎమోజీని తీసుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 800 మిలియన్ల మహిళల భావోద్వేగానికి ఇది అద్దం పడుతుందని సంస్థ తెలిపింది. అయితే ఈ ఎమోజీని బట్టి పెద్దగా అవగామన ఏర్పడదని.. పలు మహిళా సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.