ఖమ్మం జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లాలోని కారెపల్లి మండల కేంద్రంలో గుండెపోటుతో ఓ యువకుడు కుప్పకూలి మృతి చెందిన సంఘటన స్థానికులను తీవ్ర విషాదంలో ముంచింది. స్టేషన్ రోడ్డుకు చెందిన గణపతి నారాయణ–లక్ష్మీప్రసన్న దంపతుల ఏకైక కుమారుడు సాయిచంద్ర (24) ఈ దుర్ఘటనకు గురయ్యాడు.
బీఫార్మసీ పూర్తి చేసిన సాయిచంద్ర..హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఇటీవల స్వగ్రామానికి వచ్చిన అతను కొన్ని మందులు కొనుగోలు చేయడానికి స్థానిక మెడికల్ షాపుకు వెళ్లాడు. అక్కడే అకస్మాత్తుగా అస్వస్థతకు గురై కుప్పకూలిపోయాడు. ఈ ఘటన షాపులోని సీసీ కెమెరాలో రికార్డైంది.
యువకుడు పడిపోవడం గమనించిన షాప్ యజమాని వెంటనే స్పందించి ఫస్ట్ ఎయిడ్ అందించాడు. అనంతరం హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు పరీక్షించగా అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్ధారించారు. గుండెపోటే మరణానికి కారణమని ప్రాథమిక సమాచారం.
ఏకైక కుమారుడిని కోల్పోయిన తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. యువకుడి ఆకస్మిక మరణం స్థానికులను కలచివేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
