ఇప్పుడిప్పుడే పోలటిక్స్ లో యాక్టివ్ అవుతున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కంటికి మరోసారి ఆపరేషన్ జరిగింది. ఆ మధ్య రంగస్థలం సక్సెస్ మీట్ రాత్రి పూట జరిగినా, ఆ సభకు పవన్ నల్ల కళ్లద్దాలు పెట్టుకుని వచ్చారు. నేను స్టైల్ కోస ఈ స్పెట్స్ పెట్టుకుని రాలేదు. ఆ బాణసంచా వెలుగులుతో పాటు ఇతర లైటింగ్ చూడలేకపోతున్నాను. కంటి సమస్యతో గత కొన్నాళ్లుగా బాధ పడుతున్నాను. అందుకే నైట్ టైమ్ అయినా సన్ గ్లాసెస్ పెట్టుకుని రావల్సి వచ్చింది అని పవన్ కళ్యాణే స్వయంగా చెప్పారు. నెల రోజుల క్రితమే ఆపరేషన్ చేయించుకున్నారు. అనంతరం కొన్నాళ్లు విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పారు. టీవీ చూడటం, పుస్తకాలు చదవటం, కంప్యూటర్ తో వర్క్ చేయడం కొన్నాళ్లు మానుకోవాలని సూచించారు. ఎండల్లో, దుమ్మూధూలి బాగా ఉండే ప్రదేశాల్లో తిరగరాదని హెచ్చరించారు. కానీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా ఉత్తరాంధ్రతో పాటు గుంటూరు జిల్లాలోనూ పర్యటించారు. ఫలితంగా కంటికి ఇన్ఫెక్షన్ సోకి మళ్లీ ఇబ్బందులు తలెత్తడంతో రెండోసారి ఆపరేషన్ చేశారు.
అయితే రాజకీయ నాయకులు అన్నాక పార్టీ, ప్రజలు సమస్యలతో పాటు వారి ఆరోగ్యంపైనా పూర్తిగా శ్రద్ధ పెట్టాల్సిందే. ముఖ్యంగా పాదయాత్రలు, బస్ యాత్రలు, ధర్నాలు, ఆందోళనలు చేసేటప్పుడు నాయకులు శారీరకంగా, మానసికంగా ఎంత ధృఢంగా ఉన్నారనేది స్పష్టమవుతుంది. ఒకరకంగా నాయకులు పాదయాత్రలు చేసేది అందుకే. ప్రజా సమస్యలు తెలుసుకోవడంతో పాటు, వాటి పరిష్కారం పట్ల తాము ఎంత కమిట్ మెంట్, స్ట్రాంగ్ గా ఉన్నామో చెప్పడం. ఆరోగ్యకరమైన దేహంతో పాటు, చురుకైన, ధృడచిత్తం, ఆత్మవిశ్వాసం కలిగిన నేతలుగా పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపడానికి జనంలోకి తరచూ నాయకులు వస్తుంటారు.
అయితే పవన్ కళ్యాణ్ ఆ మధ్య పార్టీ వ్యవహారాల్లో, బహిరంగ సభల్లో చాలా చురుగ్గా పాల్గొన్నారు. అమరావతి సహా అనంతపురం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో పర్యటించారు. ప్రజాసమస్యలు తెలుసుకున్నారు. పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అధికార పార్టీ మీద విమర్శల దాడి చేస్తూ, సమస్యల పరిష్కారం కోసం అల్టిమేటమ్స్ కూడా జారీ చేశారు. కానీ కంటి ఆపరేషన్ తర్వాత రెస్ట్ అవసరమని వైద్యులు చెప్పడంతోనే పవన్ పర్యటనలు, బస్సుయాత్ర మధ్యలో ఆపేయాల్సి వచ్చింది. దీంతో పవన్ కళ్యాణ్ సడెన్ గా కనపడకుండా పోయారు.
ఆయనది ఆరంభ శూరత్వమే. నాలుగు రోజులు హడావుడి చేశాడు. ఇప్పుడు కనపడకుండా పోయాడు. మరో ఆరు నెలలు ఎక్కడుంటాడో కూడా తెలియదు అంటూ టీడీపీ, వైఎస్ఆర్ సీపీ సహా విమర్శల దాడి చేశాయి. వాస్తవానికి ఆ బస్సుయాత్రలోనే పవన్ కంటి సమస్య పెద్దదయింది. రాజకీయ ప్రత్యర్ధుల విమర్శలకు భయపడే ఆ యాత్ర కొనసాగించాడు. దీంతో ఆపరేషన్ తర్వాత సరిపడా రెస్ట్ లేకపోవడంతో మళ్లీ ఇన్ఫెక్షన్ సోకి సమస్య తిరగబడింది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో బస్సు యాత్రకు పులుస్టాప్ పెట్టేసి రెండోసారి ఆపరేషన్ చేయించుకున్నాడు. త్వరలో మళ్లీ బస్సుయాత్ర ప్రారంభించి ప్రత్యర్ధులకు సమాధానం చెబుతారని జనసేన వర్గాలు చెబుతున్నాయి.
