బాంబే స్టాక్ ఎక్స్ ఛేంజీ (బిఎస్ఈ)లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి బాండ్ల లిస్టింగ్ ప్రారంభమైంది.రాజధాని నిర్మాణం కోసం సీఆర్డీఏ జారీ చేసిన అమరావతి బాండ్లను బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ)లో సోమవారం నమోదు చేశారు. అంటే బీఎస్ఈలో అమరావతి బాండ్లు లిస్ట్ అయ్యాయి అన్నమాట. జ్యోతి ప్రజ్వలన అనంతరం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 9.15 గంటలకు గంట కొట్టి నమోదును లాంఛనంగా ప్రారంభించారు. బీఎస్ఈ ఎండీ, సీఈవో ఆశీష్కుమార్తో కలిసి చంద్రబాబు బాండ్ల లిస్టింగ్ను ప్రారంభించారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో పెట్టుబడులు ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ను అగ్రస్థానంలో నిలబెట్టారని బీఎస్ఈ సీఈవో, ఎండీ ఆశిష్కుమార్ అన్నారు. సాంకేతిక వినియోగంలోనూ ఏపీ ప్రథమస్థానంలో కొనసాగుతోందని ప్రశంసించారు. అమరావతి నిర్మాణానికి ప్రణాళికలు అద్భుతంగా ఉన్నాయని, నిర్మాణం సైతం బాగా కొనసాగుతోందని ఆయన కొనియాడారు.
రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధుల సమీకరణకు సీఆర్డీఏ ఇటీవల ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్పై బాండ్లను జారీ చేయగా కేవలం గంట వ్యవధిలోనే మదుపరుల నుంచి రూ.2 వేల కోట్లు సమకూరిన సంగతి తెలిసిందే. అవే బీఎస్ఈలో సోమవారం లిస్టింగ్ అవుతున్నాయి.
చంద్రబాబుతో పాటు మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, సిఆర్డిఎ అధికారులు ముంబై చేరుకున్నారు. ముంబైలో చంద్రబాబు సోమవారం మధ్యాహ్నం పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. టాటా, అంబానీ, బిర్లా, గోద్రెజ్, మహీంద్రా, గోయెంకా, లోథాలు వంటి పారిశ్రామిక వేత్తలతో చంద్రబాబుతో సమావేశం అవుతారని భావిస్తున్నారు.