ఆపరేషన్ కుంభకోణాలు మొదలైంది. గద్దెనెక్కగానే పాలనను పరుగులు పెట్టిస్తున్న జగన్.. ఇప్పుడు తాము ప్రతిపక్షంలో ఉండగా పోరాడిన సమస్యలపై యుద్ధం ప్రకటించారా.? అధికార టీడీపీ బలంతో వైసీపీ నేతలను అణగదొక్కిన నేతలను పీచమణిచేందుకు జగన్ రెడీ అయ్యారా అంటే పరిస్థితులు అలానే కనిపిస్తున్నాయి..
తాజాగా మాజీ స్పీకర్ కోడెల ‘కే’ ట్యాక్స్ వసూలుపై జగన్ ప్రభుత్వం కొరఢా ఝలిపించింది. ఆయన కుమార్తె , కొడుకుపై కేసులు నమోదు చేసి ఇరికించింది. కోడెల బండారం బయటపెట్టడానికి రెడీ అయ్యింది..
ఇప్పటికే అమరావతి రాజధాని పేరిట రైతుల భూములు లాగేసిన నేతల కుంభకోణంపై విచారణ జరిపిస్తానని జగన్ హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా చర్యలు మొదలు పెట్టారు..
ఇప్పుడు జగన్ ఫోకస్ విశాఖపై పడింది. విశాఖ భూ కుంభకోణంపై జగన్ దృష్టిసారించారు. పెద్ద ఎత్తున భూములు కొల్లగొట్టిన టీడీపీ మాజీ మంత్రుల బాగోతం బయటపెట్టడానికి జగన్ రెడీ అయ్యారు.
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఆయన నియోజకవర్గానికి చెందిన సన్నిహిత భీమిలి నేతలు విశాఖ భూకుంభకోణానికి పాల్పడ్డారని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీనిపై వైసీపీ నాయకులు కూడా పోరాడారు. ఇప్పుడు జగన్ ఈ కుంభకోణాన్ని వెలికి తీయడానికి రెడీ అయ్యారు. దీంతో టీడీపీ శిబిరంలో ఆందోళన మొదలైంది. గంటా పని అయిపోయినట్టేనా అన్న టెన్షన్ వెంటాడుతోంది.