జగన్ ముక్కుసూటిగా వెళుతున్నారు. బంధాలు, భవబంధాలకు అతీతంగా పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు. మంత్రివర్గ విస్తరణతోనే జగన్ మార్క్ కనపడింది. వైసీపీలో సీనియర్లు, ఎంతో పోరాడిన రోజా, ధర్మానా ప్రసాద్ రావు, భూమన, చెవిరెడ్డి లాంటి వాళ్లకు మంత్రిపదవులు ఇవ్వకుండా జగన్ ఆనాడే సంచలనం సృష్టించారు.
తాజాగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రులతో భేటి అయిన జగన్ సంచలన వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. ప్రతీ మంత్రి పనితీరుపై తన వద్ద సమాచారం ఉందని.. ఎవరైతే సమర్థంగా పనిచేస్తారో వాళ్లే కొనసాగుతారని.. ఇప్పుడున్న 25మందిలో కేవలం 80 నుంచి 85శాతం వరకు మంత్రులు మాత్రమే కొనసాగుతారని జగన్ హెచ్చరికలు జారీ చేశారు. రెండున్నరేళ్ల తర్వాత కొత్త వారికి అవకాశం ఉంటుందని జగన్ మరోసారి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
పనిచేసిన వారికే 2024లో సీట్లు ఉంటాయని.. ప్రకాశం.. అనంతపురం జిల్లాలోని కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై నిఘావర్గాల నుంచి రెండు రోజుల క్రితం తనకు సమాచారం అందిందని సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. ఎవ్వరైన ప్రజలకు జవాబుదారీగా ఉండాలని సంజాయిషీ ఇచ్చుకునే పరిస్థితిలోఉంటే మాత్రం కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు.
జగన్ ఇలా గద్దెనెక్కి రెండు నెలల్లోనే మంత్రులు, ఎమ్మెల్యేలపై నిఘా పెంచడం.. వారికి హెచ్చరికలు జారీ చేయడం ఆ పార్టీల్లో చర్చనీయాంశంగా మారింది.