ఆంధ్రాకు ఉద్యోగుల తరలింపు వ్యవహారం.. ఉద్విగ్న క్షణాలకు కారణమైంది. హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కమిషనర్ కార్యాలయం, సహకార శాఖ ఉద్యోగుల తరలింపు సందర్భంగా.. ఉద్యోగులు కాస్త ఆవేదనకు లోనై.. కళ్ల నీళ్లు పెట్టుకున్నారు. అమరావతికి అన్ని ప్రభుత్వ శాఖలు.. ఈ నెలాఖరు లోపు తరలిరావాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో.. వ్యవసాయ శాఖ సిబ్బంది ఆంధ్రాకు తరలివెళ్లారు. ఈ ప్రక్రియ గురువారం సాయంత్రంతో పూర్తయింది.
సిబ్బందికి వీడ్కోలు ఇచ్చేందుకు పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్ర సిబ్బంది కూడా రావడంతో.. ఆంధ్రా ఉద్యోగులు దుఖాన్ని ఆపుకోలేకపోయారు. దాదాపు 4 దశాబ్దాలుగా ఒకరితో ఒకరికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇకపై.. విడివిడిగా కలిసి పనిచేయాలన్న వాస్తవాన్ని అర్థం చేసుకుంటూ.. ఆత్మీయ సంభాషణలు చేసుకున్నారు. విభజన సమయంలో ఉన్న ఉద్విగ్న క్షణాలను తలుచుకున్నారు.
హైదరాబాద్ బషీర్ బాగ్ నుంచి.. తెలంగాణ ఉద్యోగుల వీడ్కోలు మధ్య బరువెక్కిన హృదయాలతో బయల్దేరిన ఆంధ్రా వ్యవసాయ శాఖ ఉద్యోగులు.. గుంటూరులో ఘన స్వాగతం అందుకున్నారు. కొత్త జీవితానికి మొదటి అడుగు వేశారు. అయితే.. తెలంగాణ అబ్బాయిని పెళ్లి చేసుకున్న ఆంధ్రా ఉద్యోగిని ఒకరు మాత్రం మరింత ఆవేదనకు లోనయ్యారు. ఉద్యోగుల విభజన.. వ్యవహారం.. తమ మధ్య అగాథాన్ని పెంచిందని వాపోయారు. ఉన్నతాధికారులు, ప్రభుత్వం ఈ విషయంలో చొరవ తీసుకుని.. సమస్య పరిష్కరించాలని కోరారు.