ఏపీకి ప్రత్యేకహోదా పోరాటంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు చేపట్టిన నిరాహార దీక్షను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. ఆరో రోజున నిరాహార దీక్షను కొనసాగిస్తున్న ఎంపీలు మిథున్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డిలను పోలీసులు రామ్ మనోహన్ లోహియా ఆసుపత్రికి తరలించారు. ఏపీ భవన్ వేదికగా జరుగుతున్న వైసీపీ ఎంపీల నిరాహార దీక్షా శిబిరాన్ని బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో పోలీసులు చుట్టుముట్టే సరికి అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
దాదాపు వంద మందికి పైగా వచ్చిన పోలీసులు, కార్యకర్తలను చెదరగొడుతూ దీక్ష జరుగుతున్న ప్రాంతానికి వచ్చి, వైద్యులు ఇచ్చిన రిపోర్టును ప్రస్తావిస్తూ, అక్కడి నుంచి వెంటనే లేచి ఆసుపత్రికి బయలుదేరాలని, తమకు సహకరించాలని కోరారు. దీనికి మిథున్, అవినాష్ లు ససేమిరా అనడంతో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ రంగంలోకి దిగి, దీక్షలోని ఎంపీలను బలవంతంగా అంబులెన్స్ లోకి ఎక్కించి ఆసుపత్రికి తరలించారు.
వైసీపీ కార్యకర్తలు అంబులెన్స్ లను అడ్డుకునే ప్రయత్నించారు. వాటి ముందు బైఠాయించి హోదా నినాదాలను చేశారు. ఈ విధంగా ఏపీకి ప్రత్యేకహోదా నినాదాలతో ఏపీ భవవన్ మార్మోగింది. అయితే వారందరినీ పోలీసులు పక్కకు ఈడ్చేసి అంబులెన్స్లను అక్కడ నుంచి కదిలించారు.
ఈ సమయంలో ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని, జై జగన్, జై వైఎస్సార్సీపీ అని కార్యకర్తలు నినాదాలు చేశారు. కాగా, గత ఐదు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ఎంపీల బీపీ, షుగర్ లెవల్స్ పడిపోయాయని, వారింకా దీక్ష చేస్తే ప్రాణాలకు ప్రమాదమని ఈ ఉదయం వైద్యులు నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా, తాము ఆసుపత్రిలో కూడా దీక్ష చేస్తామని, విరమించే సమస్యే లేదని ఈ సందర్భంగా ఎంపీ మిథున్ రెడ్డి వ్యాఖ్యానించారు.