ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లి ఆర్థిక వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏక్షణమైనా దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని తెలిపారు. జేపీ మోర్గాన్ నిర్వహించిన ఇండియా ఇన్వెస్టార్ సమ్మిట్ కార్యక్రమంలో వెల్లడించిన జైట్లీ, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం పొంచే వుందని అభిప్రాయపడ్డారు. ఇది జరుగకుండా చూసేందుకు రూ. 50 వేల కోట్లతో ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించాలని భావిస్తూ, అందుకు తగ్గ నిధులను సిద్ధం చేశామని అన్నారు.
ప్రధానంగా ఇండియాలో ప్రైవేటు పెట్టుబడులు తగ్గుతుండటం, బ్యాంకుల్లో మూలధనం కొరత, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు కమ్ముకుటుండటం తదితర కారణాలతో పాటు, నోట్ల రద్దు, జీఎస్టీ కారణంగా ఇప్పటికే కుదేలైన భారత ఆర్థిక వృద్ధి, మరింతగా పడిపోనుందన్న విశ్లేషకుల అంచనాలతో నష్ట నివారణాయత్నాలను నరేంద్ర మోదీ సర్కారు ప్రారంభించింది. ఉద్యోగ సృష్టితో పాటు ఆర్థిక వృద్ధిని ముందుకు దూకించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలో సిఫార్సులు చేయాలని ప్రధాని కార్యాలయం సూచించింది.
ప్రభుత్వం ప్రకటించె ప్యాకేజీ యూపీఏ ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపనగా మాత్రం ఉండబోదని అన్నారు. నాటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ మాదిరిగా తాము ఆలోచించడం లేదని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి చురుకుగా పని చేస్తున్నామని తెలిపారు. ఆర్థిక సూచికలను విశ్లేషిస్తున్నామని సరైన సమయంలో సరైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రధాని మోదీతో చర్చించిన తరువాత కొత్త ప్యాకేజీలపై నిర్ణయాలుంటాయని అరుణ్ జైట్లీ పేర్కొన్నారు.
జీఎస్టీ అమలుకు కొన్ని సాంకేతికాంశాలు అడ్డుపడుతున్నాయని పేర్కొన్న ఆయన, చివరి సమయం వరకూ వేచి చూడకుండా కనీసం నాలుగైదు రోజుల ముందుగానే వ్యాపారులు తమ రిటర్నులను దాఖలు చేసుకోవాలని సూచించారు. మూలధనం అవసరమైన ప్రభుత్వ బ్యాంకులను రీ క్యాపిటలైజేషన్ చేయనున్నట్టు పేర్కొన్నారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులకు రూ. 10 వేల కోట్లను మూలధనం నిధులుగా తమ ప్రభుత్వం కేటాయించిందని జైట్లీ గుర్తు చేశారు.
