అయోధ్య కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం 2:1 మెజారిటీతో తీర్పును ఇచ్చింది.
ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కేసును విచారిస్తుందని.. అలాగే అయోధ్య భూయాజమాన్య హక్కులపై అక్టోబర్ 29న విచారణ చేపడతామని తెలిపింది. ప్రార్థనా స్థలాలకు ఆయా మతాల్లో ప్రత్యేక స్థానముంటుందని.. అన్ని మతాలు సమానమేనని వ్యాఖ్యానించింది.
ఈ ధర్మాసనంలో న్యాయమూర్తులెవరైనా పదవీ విరమణ చెందిన వారి స్థానంలో కొత్తవారు వస్తారని వెల్లడించింది. 1994 నాటి ఎం ఇస్మాయిల్ ఫారూఖీ కేసులో తీర్పు దీనికి వర్తించబోదని త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. ఈ కేసుకు సంబంధించి 1994లో ఇచ్చిన ఆదేశాలే కొనసాగుతాయని స్పష్టం చేసింది.ఈ తీర్పు విషయంలో జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ అశోక్ భూషణ్ లతో జస్టిస్ అబ్దుల్ నజీర్ విభేదిస్తూ, విస్తృత ధర్మాసనానికి నివేదించాలని అభిప్రాయపడ్డారు.