ఎన్నికల కౌంటింగ్కు కౌంట్ డౌన్ ప్రారంభం అయ్యింది. ఏపీలో రాజు ఎవరో బంటు ఎవరో మరి కొద్దిగంటల్లో తేలనుంది. గురువారం ఉదయం 8 గంటలకు కౌటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కౌంటింగ్ మొదలు కాకముందే వైసీపీ శ్రేణులు ఆనందంలో ఉన్నాయి. అప్పుడే జగన్ సీఎం అంటూ సందడి చేయడంమొదలుపెట్టారు.
అన్ని జాతీయ సర్వేలు వైసీపీదే అధికారం అని తేల్చిచెప్పడంతో గెలుపుపై పూర్తి నమ్మకంతో ఉన్నారు పార్టీ నాయకులు, శ్రేణులు. దీంతో గెలుపు తమదంటే తమదంటూ ఇప్పటికీ ప్రకటనలు గుప్పిస్తున్నాయి. ఈ విషయంలో అధికార టీడీపీతో పోలిస్తే విపక్ష వైసీపీ నేతలు కాస్త ఎక్కువగా దూకుడును ప్రదర్శిస్తున్నారు.
కౌంటింగ్ను సమీక్షించేందుకు జగన్తో పాటు పార్టీ నాయకులు తాడేపల్లి సమీపంలోని జగన్ నివాసానికి చేరుకున్నారు. రాజధాని అమరావతిలో జగన్ నివాసం వద్ద కనిపించిన ఓ బ్యానరే అందుకు నిదర్శనం. ఓనేత ఒకడుగు ముందుకేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు అంటూ భారీ బ్యానర్ ఏర్పాటు చేశారు. ఇది ఇప్పుడు అసక్తికరంగా మారింది.
పెద్దాపురం వైసీపీ నేత దవులూరి దొరబాబు ఈ బ్యానర్ ను తయారుచేయించారు.దొరబాబు అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దాపురం సీటు ఆశించి నిరాశకు గురయ్యారు. అయినాగానీ, జగన్ పై తన అభిమానాన్ని చాటుకునేందుకు ఇలా ప్రయత్నించారు. సామాజిక మాధ్యమాల్లో ఈ బ్యానర్ విపరీతంగా సందడి చేస్తోంది.
ఓట్ల లెక్కింపు సందర్భంగా అమరావతిలోని తాడేపల్లి సమీపంలోని తన నివాసానికి చేరుకోనున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… పార్టీకి చెందిన ముఖ్యనేతలంతా అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. జగన్ అమరావతి వచ్చారని తెలుసుకున్న వైసీపీ నేతలు… ఒక్కొక్కరికి తాడేపల్లికి క్యూ కడుతున్నారు. వైసీపీ గెలవకముందే ఆ పార్టీ నేత ఈ రకమైన బ్యానర్లు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది.