అదృష్టం ఉండాలే కానీ.. నిద్ర పోతున్నోడిని లేపి మరీ అందలానికి ఎక్కించే గుణం ఉంటుంది. అదృష్టం అనేది ఎప్పుడు ఎవరి ఏ రూపంలో వరిస్తుందో చెప్పలేం. కాని రాత్రికి రాత్రే ఓ నిరుపేద కూలా కోటీశ్వరుడు అయ్యారంటే మీరు నమ్ముతారా..? కానీ నమ్మాల్సిందే. ఇతగాడి ఉదంతం వింటే.. లక్ ఉండాలే కానీ.. రాత్రికి రాత్రి కోటీశ్వరుడు కావటం ఖాయమనిపించక మానదు.
మధ్యప్రదేశ్ లోని పన్నా జిల్లాకు చెందిన మోతీలాల్ ప్రజాపతి అనే 30 ఏళ్ల కూలీ ఉండేవాడు. నిద్ర లేచింది మొదలు పడుకునే వరకూ రెక్కల కష్టాన్ని నమ్ముకొని బతుకుబండి లాగిస్తుంటాడు. తాజాగా అతగాడు గుంత తవ్వే పని చేస్తున్నప్పుడు ఒక రాయి దొరికింది. ఎందుకో అనుమానం వచ్చి తనిఖీ చేయిస్తే.. అరుదైన వజ్రమన్న విషయం బయటకు వచ్చింది.
నిరుపేద కూలీ కాస్తా రాత్రికి రాత్రి కోటీశ్వరుడయ్యాడు. అతనికి దొరికిన వజ్రం బరువు 42.9 క్యారట్ల వజ్రంగా గుర్తించారు. ఇంత పెద్ద వజ్రం గతంలో అంటే.. 1961లో లభించింది. అది 44.55 క్యారట్లు అయితే. దీన్ని వేలం వేసి, ప్రభుత్వ రాయల్టీ పోను, మిగిలిన మొత్తాన్ని మోతీలాల్ కు అందిస్తామని చెప్పారు.
అప్పులతో బాధపడుతున్న తనకు ఈ వజ్రం ఎంతో మేలు చేస్తుందని, పిల్లలను బాగా చదివించుకుంటానని మోతీలాల్ వ్యాఖ్యానించాడు. ఈ వజ్రం తనకు నెల రోజుల ముందే దీపావళిని తెచ్చిపెట్టిందని ఆనందాన్ని వ్యక్తం చేశాడు.