కర్నాటకలో ఎన్నికల హడావుడి మొదలయ్యింది. ఓటర్లను ప్రసన్నం చేసుకొనేందుకు ఇప్పటినుంచే తాయిలాలు మొదలు పెట్టారు నేతలు. ఓ వస్త్రవ్యాపారి ఓటర్లను ఆకట్టుకొనేందుకు బంఫర్ ఆఫర్ ప్రకటించారు. ఎన్నికల ముంగిట కర్ణాటకలో ఓ చీరల వ్యాపారి రూపాయికే చీర ఇస్తున్నారు. కుమారస్వామిని మరోసారి సీఎంగా చూడాలని అనుకుంటున్న బీదర్ వ్యాపారి చంద్రశేఖర్ పసరగే ఓటర్ ఐడీ చూపించండి.. రూపాయకే చీరను పట్టుకెళ్లండంటూ మహిళా మణులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు.
రూ. 150 నుంచి రూ. 250 వరకు ధర పలికే చీరలను రూపాయి, రెండు రూపాయలకే అందజేస్తామని చంద్రశేఖర్ ప్రకటించారు. ఓటర్ ఐడీ చూపిస్తే చాలు ఫ్రీగానైనా చీర తీసుకెళ్లమని చంద్రశేఖర్ చెబుతున్నారు. జనవరి 30 వరకూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ చీరలను పంపిణీ చేస్తామని ఆయన ప్రకటించారు. 15 రోజుల్లో 5 లక్షల చీరలను అందజేస్తామని ఆయన ప్రకటించడంతో.. చీరల కోసం మహిళా మణులు దుకాణం ముందు బారులు తీరారు.
బీదర్లో దాదాపు 45 వేల మందికి ఓటర్ ఐడీలు లేవు. దీంతో వారంతా ఓటు హక్కు నమోదు చేసుకొని, ఓటర్ ఐడీలు తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఇలా ఓటర్ ఐడీ చూపించిన వారికి చీరలు అందజేస్తున్నట్లు చంద్రశేఖర్ తెలిపారు. ఇదంతా ఎందుకనుకుంటున్నారా…? ఆయన జేడీఎస్ టికెట్ను ఆశిస్తున్నారు అందుకే ఇప్పటినుంచే ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారన్న మాట.