పెద్ద నోట్ల రద్దు విషయం లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అడ్డంగా వాదించి ఇరుక్కున్నారు అని అతని ఫాన్స్ సైతం అంటున్నారు. ఈ మధ్యన బీజేపీ నేతల మీద పవన్ రువ్వుతున్న మాటలూ వాటికి బీజేపీ నుంచి వస్తున్న రిప్లయ్ లూ ఇవన్నీ చూస్తుంటే పవన్ తప్పు చేసారు అనే అనిపిస్తోంది. రాజ్యాంగం పైన పట్టు ఉండి కూడా నోట్ల రద్దు వంటి ‘ఘోర తప్పిదాన్ని’ ఎలా చేశారని ప్రశ్నించారు. ఇపుడు అదే ప్రశ్నను బీజేపీ నేతలు పవన్ కు సంధిస్తున్నారు.
ఘోర తప్పిదం అని ఇపుడు చెప్తున్న పవన్ గతంలో ఎలా సమర్థించారని కమళనాథులు కస్సుమంటున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో వరుస సభలు ఏర్పాటుచేసిన పవన్ ఈ క్రమంలో విద్యార్థులతో కూడా ముచ్చటించిన సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నవంబర్ 8వ తేదీన నోట్ల రద్దు ప్రకటన చేయగా నవంబర్ 11వ తేదీన అనంతపురం జిల్లా గుత్తి కాలేజీలో విద్యార్థులతో పవన్ ముఖాముఖి సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా ఓ విద్యార్థి నోట్ల రద్దుపై పవన్ వైఖరిని ప్రశ్నించారు. దీనికి పవన్ స్పందిస్తూ.. డబ్బులు పంచి ఓట్లు కొనుక్కునే స్థాయికి మన నాయకులు వచ్చారని పేర్కొంటూ పెద్ద నోట్లు రద్దు చేయడం మంచి పని అని పవన్ స్వాగతించారు. బ్లాక్ మనీని బయటకు తీసుకు రావాల్సిన అవసరం ఉందని చెప్తూ..దీనిని తీసుకు వచ్చే విధానంలో ఇబ్బందులు పడొచ్చని కూడా వ్యాఖ్యానించిన తీరును ఏపీ బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ” పవన్ రోజుకొక మాట మాట్లాడుతున్నాడు .. ఆయన ఒక్క మాట మీదనే నిలబడాలి ” అంటున్నారు బీజేపీ నేతలు .