బీజేపీ ఎమ్మెల్యేకు మహారాష్ట్రలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్లోని గోషామహల్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆదివారం మహారాష్ట్ర ఔరంగాబాద్లో నిర్వహించిన బహిరంగ సభకు హాజరయ్యారు. సభ ముగిసిన అనంతరం అర్ధరాత్రి ఆయన హైదరాబాద్కు తిరుగు ప్రయాణమయ్యారు. 30 కిలోమీటర్లు ప్రయాణం అనంతరం మార్గమధ్యలో ఆయన కారును ఓ గుర్తు తెలియని వ్యక్తి లారీతో ఢీకొట్టాలని ప్రయత్నించాడు. అయితే రాజాసింగ్ కారు డ్రైవర్ అప్రమత్తమై వెంటనే పక్కకు తప్పించడంతో పెను ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యే రాజాసింగ్ క్షేమంగా బయటపడ్డారు.
అదే సమయంలో ఎమ్మెల్యే రాజాసింగ్ కారు వెనకాలే వస్తున్న మరో కారును ఆ లారీ ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు లారీ క్లీనర్ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ప్రమాదంపై ఎమ్మెల్యే రాజాసింగ్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా ఎవరైనా ఈ ప్రమాదానికి పథకం వేసి ఉండొచ్చునని అనుమానిస్తున్నారు. లారీతో తన కారును ఢీకొట్టాలని చూశారని ఆరోపించారు.
అయితే తన ప్రాణాపాయం పొంచి ఉంది అని పలుసార్లు బాహాటంగానే ప్రకటించారు. ఈ నేపథ్యంలో తనకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది అని చెబుతున్నారు.