ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, మణిపూర్ సరిహద్దుల్లో కార్చిచ్చు భయపెడుతోంది. నాగాలాండ్లోని అత్యంత ఆకర్షణీయమైన ప్రాంతాల్లో ఒకటైన జుకోవు లోయలో మూడు రోజుల కిందట మొదలైన ఈ దావాగ్ని అంతకంతకూ పెరుగుతోంది. గురువారం మంటలు అదుపులోకి వచ్చినట్లే కన్పించిన ఆ తర్వాత పొరుగున ఉన్న మణిపూర్కు కార్చిచ్చు వ్యాపించింది. ఈ రాష్ట్రంలోని సేనాపతి జిల్లాలో ఉన్న అడవులకు దావాగ్ని వ్యాపించడంతో మణిపూర్ ప్రభుత్వం అప్రమత్తమైంది. మంటలను అదుపుచేసేందుకు ఎన్డీఆర్ఎఫ్, సైన్యం సాయం కోరింది.
సేనాపతి జిల్లాలో మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ నిన్న ఏరియల్ సర్వే నిర్వహించారు. అటు కార్చిచ్చు పరిస్థితులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. సీఎంతో ఫోన్లో చర్చించారు. కేంద్రం నుంచి అన్ని విధాల సహకారం అందిస్తామని అమిత్ షా హామీ ఇచ్చినట్లు బీరెన్ సింగ్ ట్విటర్లో వెల్లడించారు. కార్చిచ్చును అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక, అటవీశాఖ సిబ్బంది, వాలంటీర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అటు నాగాలాండ్ ప్రభుత్వం కూడా హెలికాప్టర్ల సాయంతో మంటలను అదుపుచేసేందుకు యత్నిస్తోంది.