తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యక్తిగతంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆయుత శత చండీ మహాయాగానికి సర్వం సిద్ధమైంది. బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమయ్యే ఈ యాగాన్ని నిర్వహించేందుకు ఇప్పటికే రుత్విక్కులు యాగస్థలికి విచ్చేశారు. మంగళవారం ఉదయం నుంచి యాగ స్థలశుద్ధికోసం మూడుగంటలపాటు జరిగిన ఉదకశాంతి, మాతంగి అనుష్టాన కార్యక్రమాల్లో కెసిఆర్ దంపతులు పాల్గొన్నారు.
ఆ తరువాత యాగ బాధ్యతలను రుత్విక్కులకు అప్పగించారు. ఈ సందర్భంగా కెసిఆర్ దంపతులు స్వయంగా 11 మంది రుత్విక్కులకు పాదాభివందనం చేసి వస్త్రాలు అందించారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రశాంత్రెడ్డి, మర్రి జనార్ధన్రెడ్డి, ఎమ్మెల్సీలు కర్నెప్రభాకర్, పురాణం సతీష్ తదితరులు మిగతా రుత్విక్కులకు వస్త్రాలు అందజేశారు. ఆ తరువాత ముఖ్యమంత్రి దంపతులు దుర్గాదేవి నమస్కారపూజ, రక్షా సుదర్శన హోమం నిర్వహించారు.
సాయంత్రం యాగస్థలికి చేరుకున్న శృంగేరి పీఠాధిపతి ప్రతినిధులుగా శృంగేరి ప్రధానాధికారి గౌరీ శంకర్, ప్రధానాచార్యులు నరహరి సుబ్రహ్మణ్య భట్టు, వాచకులు తంగిరాల శివకుమార శర్మలకు దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఇక బుధవారం ఉదయం గోపూజ, గణపతి పూజతో చండీ మహాయాగం ప్రారంభమై పంచగవ్య మేళనం సేవించి శరీరశుద్ధి చేసుకొని కలశస్థాపన చేసి అనుష్టానం చేస్తారు. సాయంత్రం జపాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో మొదటిరోజు యాగం పూర్తవనుంది.
ఈ మొదటిరోజు కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్, హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి ఖోసలేలతో పాటు ఆర్ట్ ఆఫ్ లివింగ్ పండిట్ రవిశంకర్లు హాజరు కాబోతున్నారు. కాగా ఈ నెల 27న ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా హాజరవనున్నారు. ప్రతిరోజూ సుమారుగా ఆరువేల మంది కూడా ఈ పూజల్లో ప్రత్యక్షంగా పాల్గొననున్నారు. ఈ నేపధ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరబాద్తో పాటు చుట్టుపక్కల జిల్లాలనుంచి ఎర్రవల్లిలోని యాగస్థలికి చేరుకునేందుకు రూట్లలో కూడా ఏర్పాట్లు చేశారు. మొత్తానికి ప్రజాక్షేమం కోసం జరుగుతున్న ఈ యాగం ఎంతో ప్రత్యేకతను ఆపాదించుకుంది.