హైదరాబాద్ శివారులోని కొంగరకలాన్ లో వచ్చే నెల 2వ తేదీన నిర్వహించనున్న ప్రగతి నివేదన సభ ఏర్పాట్లను సీఎం కేసీఆర్ పరిశీలించారు. ముందస్తు ఎన్నికల్లో భాగంగానే ఈ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్లు కనిపిస్తోంది. సభా వేదికతో పాటు పార్కింగ్ ఏర్పాట్లను అక్కడున్న నేతలను అడిగి కేసీఆర్ తెలుసుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) పై ట్రాఫిక్ కు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది వస్తున్నందున పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
అవుటర్ రింగ్ రోడ్డు నుంచి సభా వేదికకు రావడానికి అనుగుణంగా ఇప్పుడున్న దారులతో పాటు అదనంగా మరికొన్ని దారులు నిర్మించాలని సిఎం చెప్పారు. సభాస్థలానికి రావడానికి అన్ని వైపుల నుంచి 15 నుంచి 20 రహదారులు నిర్మించాలని చెప్పారు. కొత్త రహదారుల నిర్మాణానికి ప్రభుత్వ శాఖల నుంచి అనుమతి తీసుకోవాలని, వందకు వందశాతం పార్టీ నిధులనే వినియోగించాలని సిఎం సూచించారు.
ఆయన వెంట ఎంపీ కే కేశవరావు, మంత్రులు కేటీఆర్, నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ తదితరులు ఉన్నారు.