కెసిఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం మీద కాంగ్రెస్ సీరియస్ గా ఉందా ? అవును అంటే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు .. శాసనసభా శీతాకాల సమావేశాలు ఈ నెల 16 నుంచి ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలన్న దానిపై ఈ నెల 15న సీఎల్పీ సమావేశం జరగనుంది. ఇందులోనే రెండున్నరేళ్ల ప్రభుత్వ పాలనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అంశంపై చర్చించనున్నట్టు తెలిసింది. సభ్యులందరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తే ఆ రోజు సాయంత్రమే అసెంబ్లీ కార్యదర్శికి నోటీసు అందజేసే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ నేతలు తెలిపారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని గతంలోనే కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం నిర్ణయించింది.
ప్రభుత్వం ఒక్కరోజు మాత్రమే అసెంబ్లీని జరిపి వాయిదా వేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అసెంబ్లీలో 120 మంది సభ్యులుంటే అందులో 85 మంది వరకు టీఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చినప్పుడు దానికి మద్దతు తెలపడానికి పదిమంది సభ్యులు లేచి నిలబడితే చాలు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 24 మంది ఎమ్మెల్యేలతో అప్పటి ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.