- ఇవాంకా పర్యటనకు భద్రత కట్టుదిట్టం
ఆ రోజు ఎవరూ ఇంట్లోంచి ఎవరూ బయటకు రావద్దు. అత్యవసర పనులుంటే మాకు చెప్పండి.’’ అంటూ హైదరాబాద్లో పోలీసులు ప్రజలకు చెబుతున్నారు. ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో ప్రజలకు పోలీసులు సూచనలు చేస్తున్నారు. హైదరాబాద్లోని ఫలక్నుమా ప్యాలెస్, మాదాపూర్లోని వెస్టిన్ హోటల్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. ఆయా పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నప్రజలకు, కంపెనీ ప్రతినిధులతో పోలీసులు సమావేశమై ఆ విధంగా సూచనలు ఇస్తున్నారు. ఆయా ఇళ్లల్లో ఉంటున్న వారి పేర్లు, ఫోన్ నంబర్లు, ఇతర వివరాలను నమోదు చేశారు. ప్రతి ఇంట్లో కుటుంబ సభ్యులెందరు? ఏం చేస్తున్నారు? ఎవరైనా విదేశాలకు వెళ్లారా? పది రోజుల్లో వెళ్లనున్నారా? అన్న వివరాలు సేకరించారు. రెండు, మూడు నెలల కిందట నుంచి అపరిచితులకు ఎవరైనా ఇల్లు అద్దెకు ఇచ్చారా? ఈ నాలుగైదు రోజుల్లో ఎవరైనా బంధువులు వచ్చారా? అనే విషయాలు ఆరా తీశారు. ఎవరైనా అలా వచ్చి ఉంటే.. వారి వివరాలు తీసుకున్నారు. ఇళ్లలోని వారెవరూ 28వ తేదీన బయటికి రావద్దని విన్నవించారు.
భద్రత కట్టుదిట్టం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, వైట్ హౌజ్ సలహాదారురాలు ఇవాంక ట్రంప్ ఈ నెల 28వ తేదీన హైదరాబాద్ వస్తుండటంతో కనీవినీ ఎరుగని రీతిలో భద్రతా చర్యలు చేపట్టారు. ఇవాంక బస చేయనున్న వెస్టిన్ హోటల్కు నలువైపులా కిలోమీటర్ దూరం వరకూ ఉన్న వాణిజ్య సంస్థలు, బహుళ అంతస్తుల భవనాలు, ఐటీ సంస్థల యజమానులు, ప్రతినిధులతో మాదాపూర్ పోలీసులు శనివారం సమావేశమయ్యారు. వారితో చర్చించారు. మొత్తం అమెరికా భద్రత సిబ్బంది చేతుల్లోకి ఆమె పర్యటించే ప్రాంతాలన్నీ వెళ్లాయి. ఫలక్నుమా ప్యాలెస్లో ఈ నెల 28వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సదస్సుకు హాజరవుతున్న ఇవాంక, జీఈఎస్ సదస్సు ప్రతినిధులకు విందు ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణ మండలం పోలీసులు వట్టేపల్లి, సాదిక్నగర్, ఫాతిమా నగర్, ఫలక్నుమా ప్రాంతాల్లో ఇళ్లు, మురికివాడలను పరిశీలించి అందర్నీ అప్రమత్తం చేశారు.