అధ్యక్ష పదవి నుంచి దిగిపోయే కొద్ది రోజుల ముందు చైనాపై మరోమారు ఆంక్షల అస్త్రం సంధించారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. చైనాలోని షింజియాంగ్ ప్రాంతం నుంచి వచ్చే పత్తి, టమాట ఉత్పత్తుల దిగుమతులపై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఉయ్గర్కు చెందిన ఖైదీలు, బందీలను ఆయా ఉత్పత్తుల తయారీ కోసం బలవంతంగా వినియోగిస్తున్నారనే అభియోగాల మేరకు తాజా నిషేధం విధించినట్లు అగ్రరాజ్య కస్టమ్స్, సరిహద్దు భద్రతా విభాగం(సీబీపీ) తెలిపింది.
కాటన్, టమాటలతో పాటు నిషేధం విధించిన ఉత్పత్తుల జాబితాలో దుస్తులు, టమాట విత్తనాలు, టమాట సాస్, వంటకు సిద్ధంగా ఉన్న టమాటలు, టమాటలతో చేసిన ఇతర వస్తువులు ఉన్నాయి.అమెరికాలోకి తక్కువ ధరకే వస్తువులను ఎగుమతి చేసేందుకు చైనా వినియోగిస్తున్న బానిసత్వం, దోపిడీని తాము సహించమని తెలిపారు సీబీపీ యాక్టింగ్ కమిషనర్ మార్క్ ఏ మోర్గన్. మానవ విలువలను గౌరవించే అమెరికా వ్యాపారాలను అది బాధిస్తోందన్నారు. అమెరికా సరఫరా గొలుసులో బలవంతంగా కార్మికులను వినియోగించటాన్ని హోమ్ల్యాండ్ సెక్యూరిటీ విభాగం సహించదని స్పష్టం చేశారు.