తెలంగాణలో కరోనా రెండో దశ వ్యాప్తి లేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఉద్ఘాటించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ప్రాంతీయ ఆస్పత్రిలో మంత్రి ఈటల టీకా తీసుకున్నారు. అర్హులైన వారంతా టీకా కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. అందుబాటులో ఉన్న ఆస్పత్రుల్లో టీకా వేయించుకోవాలన్నారు. కొవిడ్ వ్యాక్సిన్పై అపోహలు వద్దని చెప్పారు.
తెలంగాణలో మళ్లీ కరోనా విజృంభిస్తుందన్న విషయం పై మాట్లాడుతూ.. కొంత మంది నిర్లక్ష్య వైఖరి వల్ల ఇలాంటివి జరుగుతున్నాయని.. మాస్క్ ధరించని వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సమాయత్తం అవుతున్నామని ఆయన అన్నారు. కరోనా వైరస్ అరికట్టేందుకు సరైన నియమ నిబంధనలు పాటించాలని ఆయన మరోసారి ప్రజలను కోరారు.
హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలో పెద్ద సంఖ్యలో వృద్ధులు టీకా తీసుకుంటున్నారు. ఫీవర్ ఆస్పత్రి వద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి.. టీకా తీసుకునేందుకు వృద్ధులు తరలివచ్చారు.
జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి.. ఏర్పాట్లను పరిశీలించారు. ఇన్నాళ్లు కొవిడ్తో పోరాడిన తాము… టీకా తీసుకోవటం సంతోషంగా ఉందని.. పలువురు సంతోషం వ్యక్తం చేశారు.