ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్కు మరో షాక్ తగిలింది. దాణా కుంభకోణానికి సంబంధించిన మూడో కేసులోనూ ఆయన దోషిగా తేలారు. చైబాసా ట్రెజరీ అవకతవకల కేసులో లాలూతోపాటు బిహార్ మాజీ సీఎం జగన్నాథ మిశ్రాను రాంచీలోని సీబీఐ కోర్టు దోషులుగా తేల్చింది. వీరికి గురువారం శిక్ష ఖరారు చేయనుంది.
లాలూ దాణా స్కామ్ కు సంబంధించి దోషిగా తేలడం ఇది మూడో కేసు. మరో రెండు కేసుల్లోనూ ఆయన ఇప్పటికే దోషిగా నిరూపితం అవడమే కాకుండా, కోర్టు శిక్షలు ఖరారు చేసింది. బిహార్ రాష్ట్రంలో1990 తర్వాత చోటు చేసుకున్న దాణా స్కామ్ పై పలు కేసులను సీబీఐ కోర్టు విచారణ జరుపుతోంది. 1992-93లో చై బాసా ట్రెజరీ నుంచి అక్రమంగా రూ.33.67 కోట్లను డ్రా చేసినందుకు బిహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రాను కూడా సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చింది. దీనిపై ఎగువ కోర్టులో సవాలు చేయనున్నట్టు ఆర్జేడీ ఓ ప్రకటన చేసింది. ప్రస్తుతం లాలూ రాంచిలోని బిస్రాముండా సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.