బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్యాదవ్కు పశువుల దాణా కుంభకోణ కేసులో మరో షాక్ తగిలింది. దాణా స్కామ్కు సంబంధించిన నాలుగో కేసులో కూడా లాలూను దోషిగా న్యాయస్థానం తేల్చింది. సోమవారం రాంచీ(జార్ఖండ్) సీబీఐ కోర్టు తీర్పు వెలువరించింది.
ఇదే కేసులో మరో 30 మంది ప్రమేయం కూడా ఉన్నట్టు తేల్చింది. 1995 డిసెంబర్ నుంచి 1996 జనవరి మధ్య దుంబా ట్రెజరీ నుంచి రూ. 3.13 కోట్లను అక్రమంగా విత్ డ్రా చేసినట్టు రుజువైందని కోర్టు తెలిపింది. మరోవైపు ఇదే కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రాకు ఊరట లభించింది. ఆయనతో పాటు మరో 14 మందిని నిర్దోషులుగా విడిచిపెట్టింది.
మరోవైపు, రాంచీలోని బిశ్రా ముండా జైల్లో ఉన్న లాలూప్రసాద్ శనివారంనాడు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను రాంచీలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించి, వైద్యం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఈరోజు కోర్టుకు హాజరుకాలేకపోయారు.
దాణా స్కామ్ మొదటి కేసుకు సంబంధించి 2013లో లాలూకు ఐదేళ్ల శిక్ష ఖరారు.
రెండో కేసు.. డిసెంబర్ 23, 2017 మూడున్నరేళ్ల శిక్ష ఖరారు.
మూడో కేసు జనవరి 2018లో ఐదేళ్ల శిక్ష ఖరారు.
ఇవిగాక మరో రెండు కేసులు(పట్నా, రాంచీలలో) ఆయనపై ఉన్నాయి.