కేంద్ర హోం శాఖకు సీఐడీ అధికారుల లేఖ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను తిడితే మీకు అంతే సంగతులు. పాలనపరంగా.. నిర్ణయాల పరంగా ఎలాంటి విమర్శలు చేసినా ఇక కఠిన చర్యలే. పరిస్థితులను చూస్తుంటే ఆ విధంగా కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాను అడ్డు పెట్టుకొని మనం రెచ్చిపోయి కేసీఆర్ను, తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ఇక ముందు కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఏంటో అని అనుకుంటున్నారు కదా. ఇది విషయం చదవండి…
రామకృష్ణ ఆకుతోట అనే ఐడీతో ఎవరో ఫేస్బుక్లో 2017 నవంబర్లో సీఎం కేసీఆర్పై పలు ఆరోపణలు, అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు చేశారు. హైదరాబాద్లోని ఆజంపురాకు చెందిన టీఆర్ఎస్ కార్యకర్త వసీం అలీ ఆ పోస్టులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్లోని చాదర్ఘాట్ పోలీస్టేషన్లో నవంబర్ 13వ తేదీన కేసు నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తు నిమిత్తం ఈ కేసును సీసీఎస్ (సెంట్రల్ క్రైమ్ స్టేషన్)కు బదిలీ చేశారు. ఆ వ్యాఖ్యలు ఏ ఐపీ అడ్రస్ నుంచి ఫేస్బుక్లో పోస్టయ్యాయో.. ఆ వివరాలు ఇవ్వాల్సిందిగా సీసీఎస్ అధికారులు 2017 డిసెంబర్లో ఫేస్బుక్ సంస్థకు లేఖ రాశారు. అయిత ఐపీ అడ్రస్ ఇచ్చేందుకు ఫేస్బుక్ నిరాకరించింది.
సీఎం కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన కేసు కావడంతో దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అధికారులు నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న సీఐడీ ద్వారా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ)కు లేఖ రాశారు. ఫేస్బుక్ సంస్థతో సంప్రదించి కేసు దర్యాప్తునకు అవసరమైన సమాచారం రప్పించాల్సిందిగా లేఖలో కోరారు. మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీ ప్రకారం ఎంహెచ్ఏ ఫేస్బుక్ సంస్థపై ఒత్తిడి తెచ్చి దర్యాప్తునకు అవసరమైన సమాచారం రాబట్టాలని చూస్తున్నారు.
ఆరోపణలు చేసిన వారిపై ఫేస్బుక్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో దర్యాప్తులో భాగంగా ఏ ఐపీ అడ్రస్ నుంచి ఆ పోస్టులు పెట్టారో తెలపాల్సిందిగా సీసీఎస్ అధికారులు తెలుసుకోనున్నారు. అయితే మరో 10 రోజుల తర్వాత ఐపీ అడ్రస్ వివరాలు వచ్చే అవకాశం ఉందని, ఆ తర్వాత కేసు దర్యాప్తులో తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.