తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్కు కేసీఆర్ ఇలకాలో అవమానం జరిగింది. సోమవారం సాయంత్రం కుటుంబంతో కలిసి యాదగిరిగుట్టలోని ఆలయాన్ని సందర్శించిన గవర్నర్ నరసింహన్కు ఈ తరహా అనుభవం ఎదురైంది. ఇతర రాష్ట్రాల గవర్నర్లతో పోలిస్తే నరసింహన్ సాబ్ కాస్త భిన్నమైన వ్యక్తి. ఆయనకు భక్తిభావం ఎక్కువ.ఉమ్మడి రాష్ట్రంలో గవర్నర్ గా ఛార్జ్ తీసుకున్న తర్వాత తిరుమలకు ఆయన ఎంత తరచూ వెళ్లే వారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆయాలకు ఆయన కుటుంబ సమేతంగా వెల్తుంటారు.
రాష్ట్ర విభజన తర్వాత తిరుమలను తలపించేలా యాదగిరి గుట్టను అభివృద్ధి చేయాలని కేసీఆర్ నిర్ణయించకున్నారు. అందుకు అనుగుణంగా అక్కడ పనులు చేపట్టింది ప్రభుత్వం. అలాంటి కేసీఆర్ అడ్డాలో చేదు అనుభవం ఎదురయ్యింది.
యాదాద్రి ఆలయంలోని పూజారులు, అధికారులపై గవర్నర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవైష్ణవ ఆచారాన్ని పాటించే గవర్నర్ సాబ్ కు గుట్ట పూజారులు తూతూ మంత్రంగా ఆశీర్వచనాలు ఇవ్వటంతో ఆయన కోపం నశాళానికి అంటింది. ఆలయాల్లో పూజలు, సందర్శకులకు ఆశీర్వచనాల తీరుపై అవగాహన గల వ్యక్తిగా నరసింహన్కు పేరుంది.
చతుర్వేద పారాయణం, మహాదాశ్వీరచనం జరపకుండానే అశీర్వచనం పూర్తి చేస్తారా అంటూ వారిని నిలదీశారు. పండితుల తీరును అవమానంగా భావించిన గవర్నర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేయటమే కాదు.. తనలాంటి వారికి ఆశీర్వచనం పలకటం ఇదేనా? అంటూ ప్రశ్నించారు. ఆశీర్వచనంలో చతుర్వేద ఆశీర్వచనం చేయాలి కదా? అంటే క్వశ్చన్ చేశారు. గవర్నర్కే ఇలాంటి పరిస్థితి ఎదురయితే సామాన్య భక్తల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.