సూరత్కు చెందిన వజ్రాల వ్యాపారి సావ్జి దోలకియా గుర్తుండే ఉంటుంది. ప్రతి ఏటా తమ ఉద్యోగులకు ఖరీదైన బహుమతులు ఇస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఇళ్లు, కార్లు, వజ్రాలు, ఆభరణాలు ఇలా ఎంతో విలువైన గిఫ్ట్స్ ఇస్తూ వారి ఉద్యోగులను ఆశ్చర్యంలో ముంచెత్తుతారు.
తాజాగా ఈ ఏడాదికూడా ఘనతనే నమోదు చేశాడు. తన వద్ద 25 ఏళ్ల నుంచి నమ్మకంగా పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగులకు ఒక్కొక్కటి కోటి రూపాయల ఖరీదు చేసే బెంజ్ జీఎస్ఎల్ ఎస్యూవీ కార్లను బహుమతిగా అందించి ఆశ్చర్యపరిచారు. సూరత్లో ఘనంగా నిర్వహించిన ఈ బహుమతుల ప్రదానోత్సవానికి గుజరాత్ మాజీ సీఎం ఆనందీ బెన్ పటేల్, మధ్యప్రదేశ్ గవర్నర్ హాజరై బహుమతులు అందించారంటే ప్రాధాన్యత అర్థం చేసుకోవచ్చు.
మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ 350డీ ఎస్యూవీ ఆన్-రోడ్డు ధర ప్రస్తుతం సూరత్లో కోటి రూపాయలుగా ఉంది. నీలేష్ జాదా (40), ముఖేష్ చందర్ (38), మహేష్ చంద్పర(43)లు చిన్న వయసులోనే అంటే 13 లేదా 15 ఏళ్లు వయసున్న సమయంలో ఈ వజ్రాల వ్యాపారి కంపెనీలో చేరారు. డైమాండ్స్ను కట్ చేయడం నుంచి తమ పనిని నేర్చుకున్న ఈ ఉద్యోగులు, ప్రస్తుతం కంపెనీలో సీనియర్ ఉద్యోగులని, ఎంతో నమ్మకమైన ఉద్యోగులుగా వీరు నిలుస్తున్నట్టు దోలకియా చెప్పారు.
2016లో దీపావళి కానుకగా మొత్తం 1716 మంది ఉద్యోగులకు బహుమతులు అందించాడు. కొందరికి ప్లాట్లు, కొందరికి కార్లు, మరికొందరికి బంగారం ఇలా… భారీ నజరానాలు అందించేందుకు ఏకంగా 51 కోట్ల రూపాయలు ఖర్చుచేశాడు దోలకియా. హరికృష్ణ డైమండ్స్ ఎక్స్పోర్టు కంపెనీలో మొత్తం 5500 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా కంపెనీ వార్షిక టర్నోవర్ 6 వేల కోట్ల పైమాటే. 1977లో గుజరాత్లో అడుగుపెట్టిన దోలకియా వజ్రాల వ్యాపారంతో కోట్లకు పడగలెత్తాడు.
