వైసీపీ అధినేత జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన దాడిపై హోం మంత్రి చినరాజప్ప వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హోంమంత్రి అయి ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా సిగ్గుచేటు. ఒకవైపు ఈ దాడిని ఖండిస్తున్నాం అంటూనే, ఇంటరాగేషన్ జరుగుతున్నదని అంటూనే.. ఇలాంటి ఘటనలు జరగడానికి ఎప్పుడూ అవకాశం ఉంటుందని.. జగన్మోహన్ రెడ్డి కూడా బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
జగన్.. సెల్ఫీలు, ముద్దులంటే ముందుంటారని చినరాజప్ప చేసిన కామెంట్స్ ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. పదినిమిషాల పాటు విలేకర్ల సమావేశం నిర్వహించిన హోంమంత్రి చినరాజప్ప.. కనీసం ఒక్కమాట కూడా.. భద్రతా వైఫల్యం ఉన్నట్లుగా అంగీకరించకపోవడం గమనార్హం.
అభిమానులు సెల్ఫీదిగడానికి వచ్చినపుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ప్రజాప్రతినిధిపై ఉంటుందన్నారు. మాతో కూడా సెల్ఫీలు దిగుతున్నారు మేం జాగ్రత్తగా ఉంటున్నాము. ఏది ఏమైనా.. ఎయిర్ పోర్ట్పై జరిగిన ఈ దాడిని సహించేది లేదు.. అతడు ఎంతవాడైనా చర్యలు తీసుకుంటాం. పూర్తి వివారాలను సేకరిస్తున్నాం’’ అని చినరాజప్ప సన్నాయి నొక్కులు నొక్కారు.
దాడిచేసిన శ్రీనివాస్ ను తమ పోలీసులు అరెస్టు చేశారని, ఇంటరాగేషన్ జరుగుతున్నదని.. ఆయన ఏ పార్టీకి చెందినవాడో, ఎవరు ఆయన వెనుక ఉండి.. ఈ దాడి చేయించారో అన్ని వివరాలు ఒక గంటలోగా చెప్తాం అంటూ చినరాజప్ప వ్యాఖ్యానించారు.