All are Equal But Some are more Equal .. జార్జ్ ఆర్వేల్ అనే ఓ రచయిత ఈ వాక్యాన్ని మొదటిసారిగా ఉపయోగించారు. దీని అర్థం మీకు అర్థమయ్యే ఉంటుంది. చట్టం, నియమాలు అందరికి సమానమే .. కానీ కొందరికి ఇవేందుకో కొమ్ము కాస్తుంటాయి. 1954లో వచ్చిన యానిమల్ ఫామ్ అనే ఓ నవల చదివితే ఇవన్ని క్షుణ్ణంగా అర్థమవుతాయి. సరే ఇప్పుడీ వాక్యం అంత అర్జెంటుగా ఎందుకు గుర్తొచ్చింది అంటారా? సీఎం చంద్రబాబు, హోంమంత్రి చినరాజప్ప, ఏపీ డీజీపీ వ్యాఖ్యలు వింటూంటే ఆ వాక్యం గుర్తుకు రావడమే కాదు ముమ్మాటికి నిజమనిపిస్తోంది.
విషయమేమిటంటే.. పోలీసుశాఖలో పదోన్నతులు కేవలం సీఎం సామాజిక వర్గం వారికి మాత్రమే జరగుతోందంటూ కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అప్పటిదాకా ఈ విషయం అసలు బాహ్యాప్రపంచానికి తెలియదు. అంటే ఈ తంతు చాపకింద నీరులా సాగిపోయిందన్న మాట వాస్తవం. ఇక జగన్ వ్యాఖ్యలపై చంద్రబాబు, ఏపీ డీజీపీ స్పందించారు. అసలు రాష్ట్రానికి హోంమంత్రి ఉన్నారన్న విషయం మరోసారి గుర్తుకు తెప్పిస్తూ చిన్నరాజప్ప కూడా స్పందించారు.
పోలీసులకు కులం ఉండదని.. తమది ఖాకీ కులం.. హైకోర్టు ఆదేశం మేరకు మెరిట్ ప్రకారం పదోన్నతులు ఇస్తామే తప్ప సామాజిక వర్గం ఏంటో తాము చూడమంటూ ఏపీ డీజీపీ ఠాకూర్ అన్నారు.
ఇక హోంమంత్రి చినరాజప్ప నోట కూడా ఇదే మాట. కోర్టు తీర్పు ప్రకారమే పదోన్నతులు ఇచ్చామన్నారు. ఒకే సామాజిక వర్గానికి పదోన్నతులు ఇస్తున్నారనేది అవాస్తవమన్నారు.
ఇక చంద్రబాబైతే జగన్పై అగ్గిమీద గుగ్గిలమయ్యారు. జగన్ కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ లిస్ట్లో ఉన్నవారికే సీఐల నుంచి డీఎస్పీలుగా ప్రమోషన్ వచ్చినట్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో తిరుగుతున్న వార్త. నియమాల ప్రకారమే వీరందరికి పదోన్నతులు కల్పించారు. అంటే ఆ నియమాలను కేవలం ఆ సామాజిక వర్గ అధికారులే పాటించారా? ఇంకే సామాజిక వర్గ అధికారులు నియమ నిబంధనలు పాటించడం లేదా? అనే ప్రశ్నలు తలెత్తుతాయి. జార్జ్ ఆర్వేల్గారు చెప్పిన వాక్యం సరిగ్గా సూటైంది కదూ!