ప్రముఖ టెలికాం సంస్థలైన వొడాఫోన్, ఐడియా విలీనం ఎట్టకేలకు పూర్తయింది. దీంతో భారత్లో అతిపెద్ద టెలికం కంపెనీగా వొడాఫోన్-ఐడియా లిమిటెడ్ అవతరించింది. రెండు సంస్థలకు సంయుక్తంగా 40.80 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు.
వొడాఫోన్-ఐడియా లిమిటెడ్ కొత్త బోర్డులో మొత్తం 12 మంది డైరెక్టర్లు ఉండనున్నారు. వారిలో ఆరుగురు స్వతంత్ర డైరెక్టర్లు ఉండగా.. కుమార మంగళం బిర్లా ఛైర్మన్గా వ్యవహరించనున్నారు. ఈ బోర్డుకు బాలేశ్ శర్మ(వొడాఫోన్ ప్రస్తుత సీఈవో ) సీఈవోగా నియమితులైనట్లు సంస్థ తన ప్రకటనలో పేర్కొంది.
ఇప్పటి వరకు భారత్లో అతిపెద్ద టెలికాం సంస్థగా భారతీ ఎయిర్టెల్ ఉంది. ఇప్పుడు ఆ స్థానాన్ని వొడాఫోన్-ఐడియా లిమిటెడ్ ఆక్రమించింది. దీంతో పాటు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద టెలికాం సంస్థగా వొడాఫోన్-ఐడియా లిమిటెడ్ నిలవనుంది.
కంపెనీల విలీనం కోసం టెలికాం శాఖకు ఏకకాల స్పెక్ట్రామ్ ఛార్జిల కింద రూ.3,900కోట్ల నగదు, రూ.3,300కోట్లకు బ్యాంక్ గ్యారెంటీలీను సమర్పించినట్లు సంస్థ వెల్లడించింది. తాజా విలీనం నేపథ్యంలో ఇరు కంపెనీల షేర్లు మార్కెట్ లో స్వల్ప లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి.
టెలికాం సంచలనం రిలయన్స్ జియో రాకతో సంస్థల మధ్య పోటీ మరింత పెరిగింది. వొడాఫోన్ ఐడియా విలీనంతో ఏడాదికి రూ.14వేల కోట్ల ఆదాయం అదనంగా వచ్చే అవకాశం ఉందని కంపెనీ భావిస్తోంది. ఈ రెండు కంపెనీల రుణాలు జూన్ 30, 2018 నాటికి 1.09లక్షల కోట్లుగా ఉన్నాయి.