- టైటిల్ నెగ్గిన హర్యానా అమ్మడు
భారత కీర్తిలో మరో కలికితురాయిలాంటి అవార్డు వచ్చి చేరింది. దాదాపు 17 ఏళ్ల తర్వాత మన దేశానికి ఆ అవార్డు దక్కింది. ప్రపంచ సుందరి టైటిల్ను ఈసారి మనకు వచ్చింది. మిస్ ఇండియాగా ఎంపికైన మానుషి చిల్లర్ ఈసారి ప్రపంచ కిరీటాన్ని సొంతం చేసుకుంది. 20 ఏళ్ల యువతి 2017 మిస్ వరల్డ్ టైటిల్ భారత్కు తీసుకొచ్చింది. చైనాలోని సాన్యా నగరంలో శనివారం రాత్రి జరిగిన 67వ మిస్ వర్డల్ పోటీల్లో ఆమె విజయం సాధించింది. 118 దేశాల యువతుల పోటీని తట్టుకొని కిరీటాన్నిభారత బిడ్డ ముద్దాడింది. సుందరాంగుల్ని తోసిరాజేసి ప్రపంచ సుందరి మకుటాన్ని కైవసం చేసుకుంది. మానుషి చిల్లర్ది దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని హర్యానా రాష్ర్టం. వైద్య కోర్సు చదువుతోంది.
మనకు మొత్తం ఆరు టైటిల్స్
మానుషి చిల్లర్ సాధించిన కిరీటంతో మన దేశ ఖాతాలో ఆరు మిస్ వరల్డ్ టైటిల్స్ చేరాయి. మొదటిసారి 1966లో రీటా ఫారియా మిస్ వరల్డ్ కిరీటంతో మన దేశం ఖాతా తెరిచింది. 1994లో ఐశ్వర్య రాయ్, 1997లో డయానా హేడన్, 1999లో యుక్తా ముఖీ, 2000లో ప్రియాంకా చోప్రా ఆ కిరీటాలను అందుకున్నారు. ప్రపంచంలో భారత్, వెనెజులాలు మాత్రమే 6 మిస్ వరల్డ్ టైటిల్స్ గెలుచుకున్న దేశాలుగా నిలుస్తున్నాయి. ఇక దీనితోపాటు మరో ప్రతిష్టాత్మక అవార్డు ‘మిస్ యూనివర్స్’. ఇవి ఇప్పటివరకు మన దేశానికి రెండు వచ్చాయి. 1994లో సుస్మితా సేన్, 2000లో లారాదత్తా విశ్వసుందరిగా నిలిచారు.
జవాబుకు ఫిదా
ప్రపంచంలో ఏ వృత్తికి అత్యధిక జీతం ఇవ్వాలి? ఎందుకు? అనే ప్రశ్నను మానుషి చిల్లర్కు అడిగారు. ‘ప్రపంచంలో తల్లికే ఎక్కువ గౌరవం దక్కాలని నేను భావిస్తున్నా. ఇక వేతనం గురించి మాట్లాడినప్పుడు.. అది డబ్బు గురించే కానక్కర్లేదు. ఒకరిపై చూపే ప్రేమ, వారికిచ్చే గౌరవం కూడా కావచ్చు. నా జీవితంలో నా తల్లే అతి పెద్ద ఆదర్శం. పిల్లల కోసం తల్లిదండ్రులు ఎంతో త్యాగం చేస్తారు. అందుకే తల్లి ఉద్యోగానికే ఎక్కువ జీతం ఇవ్వాలని నేను భావిస్తున్నా’ అని చెప్పిన సమాధానానికి అందరూ ఫిదా అయ్యారు. ఈ సమాధానంతో ఆ ప్రాంగణం చప్పట్లతో మార్మోగిపోయింది. పోటీ అనంతరం 2017 కిరీటాన్ని మానుషి చిల్లర్ గెలుచుకుందని మిస్ వరల్డ్ పోటీల కమిటీ అధికారిక ఫేస్బుక్, ట్వీటర్ పేజీల్లో వెల్లడించింది.