పంజాబ్ నేషనల్ బ్యాంకుకి రూ.13,000 కోట్లు అప్పు చెల్లించకుండా ప్రముఖ వజ్రాల వ్యాపారి, నేరస్థుడు, బిలియనీర్ నీరవ్ మోదీ లండన్లో ఉన్నట్లు స్పష్టమైంది. వేషం మార్చి లండన్ వీధుల్లో ఈ ఆర్థిక నేరగాడు దర్జాగా తిరుగుతున్నారని టెలిగ్రాఫ్ ధృవీకరించింది. నీరవ్ మోదీ అక్కడి అత్యంత విలాసవంతమైన రూ.500 కోట్ల రూపాయల విలువైన అపార్ట్మెంట్లో నివసిస్తున్నట్లు తెలుస్తోంది. అతడు అక్కడ కూడా వజ్రాల వ్యాపారం మొదలుపెట్టినట్లు స్పష్టమైంది.
లండన్లోని వెస్ట్ ఎండ్లో విహరిస్తున్న నీరవ్ను టెలిగ్రాఫ్ రిపోర్టర్ గుర్తించాడు. టెలిగ్రాఫ్ రిపోర్టర్ ప్రశ్నించగా నో కామెంట్ అంటూ నవ్వుతూ సమాధానమిచ్చాడు నీరవ్. ఈ మొత్తం వ్యవహారాన్ని ఆ రిపోర్టర్ వీడియోగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ ఆర్థిక నేరగాడి ఆచూకి వెలుగు చూసింది. తనని ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు వేషం మార్చి మీసాలు, గడ్డాలు పెంచి దర్జాగా తిరుగుతున్నారు. అతన్ని భారత్కు అప్పగించాల్సిందిగా భారత ప్రభుత్వం 2018 ఆగస్టులోనే ఓ ప్రతిపాదన పెట్టింది. అయితే ఇప్పటి వరకు బ్రిటన్ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని కేంద్ర విదేశాంగ శాఖ తాజాగా తెలిపింది. మరోవైపు నీరవ్కు ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీచేసినా అక్కడి ప్రభుత్వం ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ప్రస్తుతం PNB స్కాంలో నీరవ్ మోదీ వాంటెడ్ నేరగాడు.