హైదరాబాద్: టీడీపీ ప్రభుత్వం వైజాగ్లో నిర్వహించ తలపెట్టిన బీచ్ ఫెస్టివల్పై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ముఖ్యంగా వైఎస్సార్సీపీ పార్టీ దీన్ని తీవ్రంగా తప్పు పడుతోంది. వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఆ ఫెస్టివల్లో పాల్గొనే ప్రేమ జంటలకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తాళి కట్టిస్తారా అని విమర్శించిన సంగతి తెలిసిందే.
అయితే తాజాగా వైసీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి ఈ ఫెస్టివల్పై స్పందించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ఎవరి కోసం ఈ బికినీల పండుగ? చంద్రబాబు అనాలో, బికినీ బాబు అనాలో అర్ధం కావడం లేదని అన్నారు. విదేశీ విష సంస్కృతిని ప్రవేశపెట్టడానికే చంద్రబాబు బికినీ ఫెస్టివల్ తలపెట్టారని విమర్శించారు. మహాకవులు, రచయితలకు నిలయమైన విశాఖపట్నంలో బికినీల పండగ చేయాలనుకోవడం సిగ్గుచేటని అన్నారు భూమన కరుణాకరరెడ్డి. ఫిబ్రవరి 12 నుంచి 14 తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ బీచ్ ఫెస్టివల్ను నిర్వహించనున్నారు.
ఇందులో తొమ్మిది వేల మంది విదేశీ జంటలు ప్రత్యేకంగా పాల్గొంటారు. ఇందులో షకీరా వంటి పలువురు ప్రముఖ సెలబ్రిటీలతో ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చెయ్యాలని ప్లాన్ చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి.