తాడిపత్రి మాజీ టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తో పాటు కుమారుడు జేసీ అస్మిత్రెడ్డిని శనివారం ఉదయం హైదరాబాద్లోని తన నివాసంలో అనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నా అనంతరం వీరిని హైదరాబాద్ నుంచి అనంతపురానికి తరలిస్తున్నారు.
బీఎస్-3 వాహనాలను బీఎస్-4గా రిజిస్ట్రేషన్ చేసి అమ్మకాలు సాగించినట్లు తేలడంతో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాత బీఎస్ 3 వాహనాలను నకిలీ పత్రాల సాయంతో కొత్త వాహనాలుగా రిజిస్ట్రేషన్లు చేయించినట్టు గుర్తించారు. అనంతపురం, తాడిపత్రి పోలీస్ స్టేషన్ లలో జేసీ ట్రావెల్స్పై ఇప్పటికే 27 కేసులు నమోదు అయ్యాయి. అందులో 24 కేసులు నకిలీ రిజిస్ట్రేషన్ లకు సంబంధించినవే.
వాటికి సంబంధించిన ఫేక్ ఎన్ఓసీ, ఫేక్ ఇన్సూరెన్స్ల కేసుల్లో వీరిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. నకిలీ పత్రాల సాయంతో నాగాలాండ్లో రిజిస్ట్రేషన్లు చేయించారు. ఇప్పటికే 60 వాహనాలను రవాణా శాఖ అధికారులు సీజ్ చేశారు. మరో 94 వాహనాలను జేసీ బ్రదర్స్ దాచిపెట్టారని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. కొన్ని లారీలను బస్సులుగా మార్చి నడుపుతున్నట్టు గుర్తించి కేసు నమోదు చేశారు.