దక్షిణాది రాష్ట్రంలో అత్యంత కీలక రాష్ట్రమైన కర్నాటక ఎన్నికల ఫలితాలకు అనుగుణంగా స్టాక్ మార్కెట్లు ఆటుపోట్లను ఎదుర్కొన్నాయి. తొలుత బీజేపీ మేజిక్ మార్కు దిశగా దూసుకుపోతున్న తరుణంలో మార్కెట్లు ర్యాలీని కొనసాగించినా తరువాత తగ్గుముఖం పట్టాయి.
బీజేపీ అత్యధిక సీట్లు గెలుచుకున్నప్పటికీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి స్పందించారు. దీంతో ఉదయం భారీ లాభాల దిశగా సాగిన మార్కెట్లు సాయంత్రం అయ్యే సరికి స్తబ్ధుగా మారాయి. చివరకు స్వల్ప నష్టాలతో సరిపెట్టాయి. మార్కెట్లు ముగిసే సరికి బీఎస్ఈ 13 పాయింట్ల లాభంతో 35,544 వద్ద ముగియగా, మరో సూచీ నిఫ్టీ 5 పాయింట్లు కోల్పోయి 10801వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో టాటా స్టీల్(2.61%), పవర్ గ్రిడ్(2.22%), ఇండస్ ఇండ్ బ్యాంక్(1.54%), టీసీఎస్(1.41%), ఏషియన్ పెయింట్స్(0.89%) లాభాల్లో ముగియగా, మరో వైపు టాటా మోటార్స్(4.27%), ఎస్బీఐఎన్(2.55%), కోల్ ఇండియా(1.78%), సన్ ఫార్మా(1.28%), ఐటీసీ(1.11%) ఎక్కువగా నష్టపోయిన వాటిలో ముందున్నాయి.