ప్రస్తుతం దేశవ్యాప్తంగా కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఆ రాష్ట్ర ఎన్నికలు 2019 సాధారణ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపేవి కావడంతో సర్వత్రా కర్నాటక ఎన్నికలు ఉత్కంఠతో కూడుకున్నాయి. ప్రస్తుతం కర్నాటక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యింది. ప్రస్తుతం ఎన్నికల ప్రచారం కర్నాటకలో హోరాహోరీగా కొనసాగుతోంది. అయితే ఎన్నికల సంఘం మాత్రం కర్నాటకలోని నాయకులకు చుక్కలు చూపిస్తోంది.
ఎన్నికల సందర్భంగా అవినీతి, అక్రమాలు చోటుచేసుకుంటాయని భావిస్తూ ముమ్మరంగా తనిఖీలు చేపడుతోంది. ఈ సందర్భంగా ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆప్త మిత్రుడు అమిత్ షాను కూడా ఎన్నికల సంఘం వదలలేదు. అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్ను కూడా ఎన్నికల సంఘం ఆదేశంతో అధికారులు తనిఖీలు చేశారు.
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కూడా వదలలేదు. రాహూల్ ప్రయాణించిన విమానాన్ని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు తనిఖీ చేశారు. ఇక కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యనూ వదిలిపెట్టడం లేదు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలపై ఎన్నికల సంఘం డేగకన్ను వేసింది.
ఎన్నికల సంఘం దూకుడుతో అన్నీ రాజకీయ పార్టీల నాయకులు బెంబేలెత్తిపోతున్నారు. ఎన్నికల అక్రమాలకు సంబంధించి జరిగే చర్యలను ముందస్తు నుంచి అడ్డుకుంటోంది. మొత్తం 1,500కు పైగా ఫ్లయింగ్ స్క్వాడ్స్ రంగంలోకి దింపి తనిఖీలు చేపడుతున్నారు. ఎన్నికల అక్రమాలకు పూర్తిస్థాయిలో చెక్ పెట్టేందుకు ఎన్నికల సంఘం సిబ్బంది మఫ్టీలో వివిధ రాజకీయ పార్టీలు, ప్రముఖ నాయకుల నివాసాలు, కార్యాలయాల వద్ద సంచరిస్తున్నట్లు తెలుస్తోంది.