పాటలతో ఓ ఆట ఆడుకున్నాడు. ఒక్క భాష కాదు.. ఏకంగా 105 భాషల్లో 105 పాటలను పాడి సత్తా చాటాడు. ఎట్టకేలకు గిన్నీస్బుక్లో చోటు సంపాదించాడు. విజయవాడకు చెందిన మల్లాది రాహత్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. తన అద్భుత ప్రతిభతో 105 ప్రపంచ భాషల్లో 105 పాటలను 7 గంటల 20 నిమిషాల పాటు నిర్విరామంగా పాడాడు. గిన్నీస్లో చోటు కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ పాటల్లో భారతీయ భాషలు 36 ఉన్నాయి. విజయవాడ గాంధీనగర్లోని శ్రీరామ ఫంక్షన్హాల్లో ఈ ఫీట్ సాధించాడు రాహత్.
గిన్నిస్ నియమాల ప్రకారం 4 గంటల అనంతరం 5 నిమిషాలు విరామం తీసుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించాడు. దీంతో గతంలో గజల్ శ్రీనివాస్ పేరుతో ఉన్న 75 భాషల్లో పాటల రికార్డును రాహత్ దాటేశాడు. ఈ కార్యక్రమానికి విద్యావేత్త ఎం.సి.దాస్, భారతీయ విద్యాభవన్ ప్రతినిధి పార్థసారథి సాక్షులుగా వ్యవహరించారు. గీతాలపన కార్యక్రమాన్ని ప్రత్యేక యూనికోడ్ ద్వారా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థకు అందించారు. రెండు వారాల అనంతరం గిన్నిస్ బుక్ ప్రతినిధుల నుంచి నమోదు పత్రం అందుతుందని రాహత్ తండ్రి అనిల్ కుమార్ తెలిపారు.