టీడీపీ – జనసేన పొత్తులో భాగంగా 30కి పైగా స్థానాల్లో పోటీ చేసేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు. కొన్ని స్థానాల్లో టీడీపీ సీనియర్ నేతల నుండి వ్యతిరేకత వస్తుండగా మరికొన్ని స్థానాలను వదులుకునేది లేదని తేల్చి చెబుతున్నారట పవన్. ఇందులో భాగంగా ఓ రెండు స్థానాలు మాత్రం ఖచ్చితంగా కావాలని డిమాండ్ చేస్తున్నారట.
ఇందులో ఒకటి గుంటూరు పశ్చిమ కాగా మరొకటి విజయవాడ సిటీ పరిధిలోని స్థానం అని తెలుస్తోంది. విజయవాడ ఈస్ట్ నుండి టీడీపీ తరపున గద్దె రామ్మోహన్ రావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండగా విజయవాడ సెంట్రల్, విజయవాడ పశ్చిమలో వెల్లంపల్లి శ్రీనివాస్ రావు, మల్లాది విష్ణులు సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. దీంతో విజయవాడ ఈస్ట్ వదిలేసి మిగిలిన రెండు స్థానాల్లో ఒకటి ఇవ్వాలని తేల్చి చెబుతున్నారట పవన్.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ మాజీ ఎంఎల్ఏ బోండా ఉమ మళ్ళీ పోటీకి రెడీ అవుతున్నారు.గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు బొండా ఉమా. ఇక విజయవాడ పశ్చిమలో మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఇప్పటికే పోటికి రెడీ కావడంతో ఏ సీటు పవన్ పార్టీకి ఇస్తారోనన్న టెన్షన్ అందరిలో నెలకొంది. ఇప్పటికే తన ప్రతిపాదనను చంద్రబాబు ముందు ఉంచారట పవన్. విజయవాడ సిటీ పరిధిలోని మూడు స్థానాల్లో ఒకటి ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పారట. ఈ నియోజకవర్గాల్లో పలుమార్లు సర్వే నిర్వహించామని ఖచ్చితంగా జనసేన గెలిచే అవకాశం ఉందని తెలిపారట పవన్. మరి పవన్ ప్రతిపాదనను చంద్రబాబు ఏ మేరకు అంగీకరిస్తారో వేచిచూడాలి.