పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎంత మొండి మహిళో అందరికి తెలుసు. ఒక్కసారి తను ఫిక్స్ అయ్యిందంటే అది మంచైనా.. చెడైనా చేసుకుంటూ పోవడమే తనకలవాటు. ఇప్పటికే బీజేపీ అన్న పేరు వినిపిస్తేనే అగ్గి మీద గుగ్గిలమవుతున్న మమత.. బీజేపీ నేతలకు వరుసగా షాక్ ఇస్తుంది. ఇప్పుడు తాజాగా మరో బీజేపీ నేతకు షాక్ ఇచ్చింది మమతా. మొన్నటికి మొన్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా హెలికాప్టర్ ల్యాండింగ్కు అనుమతి ఇవ్వని ఆమె.. తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను కూడా రాష్ట్రంలో అడుగుపెట్టనివ్వలేదు.
బెంగాల్లోని బాలూర్ఘాట్లో ఆదివారం సాయంత్రం జరిగే ర్యాలీ కోసం యోగి రావాల్సి ఉంది. అయితే తమకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే హెలికాప్టర్ ల్యాండింగ్కు అనుమతి ఇవ్వలేదని యోగి కార్యాలయం ప్రకటన వెలువరించింది. యోగికి ఉన్న పాపులారిటీ కారణంగానే మమత కనీసం ఆయన హెలికాప్టర్ను కూడా ల్యాండ్ కానీయలేదని ఆయన అనుచరులు అంటున్నారు. యోగి హెలికాప్టర్ ల్యాండింగ్కు అనుమతి ఇవ్వకపోవడంతో బీజేపీ కార్యకర్తలు నిరసన తెలుపుతున్నట్లు బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ చెప్పారు. ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో బీఎస్ఎఫ్కు చెందిన రాయ్గంజ్ క్యాంప్లో యోగి హెలికాప్టర్ ల్యాండ్ కానుంది. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఆయన బాలూర్గాట్కు రానున్నారు.
ఇప్పటికే మమత ఓ నియంతలా తన పాలనను కొనసాగిస్తున్నారని.. తనకు అడ్డు వచ్చిన వారిని నామరూపాల్లేకుండా చేస్తున్నారని సాక్షాత్తూ ప్రధాని మోదీ గుండెలు బాదుకుంటున్నారు. మూడు దశాబ్ధాల కమ్యూనిస్టుల కంచుకోటను బద్దలు కొట్టి సీఎం పగ్గాలు చేపట్టిన మమతా.. రెండోసారి అధికారం చేపట్టాక కాస్తంతా నియంతలా మారిన మాట వాస్తవమేనంటారు రాజకీయ విశ్లేషకులు. తన రాష్ట్రంలో మరే పార్టీని కూడా ఎదగనీయకుండా చర్యలు తీసుకుంటున్నారు. దీనికోసం ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. అందులో భాగంగానే బీజేపీ ఎదుగుదలను కూకటి వేళ్లతో పెకిలించాలనేది ఆమె కోరిక. కానీ మోదీ- అమిత్ షా ద్వయం ఆమె ప్రణాళికలకు ఎప్పటికప్పుడు అడ్డు కట్ట వేస్తూ వస్తున్నారు. ఇటీవల ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న అందించడం కూడా బెంగాల్ ప్రజలను బుట్టలో వేసుకోవడానికే అని ఓ ప్రచారం నడుస్తోంది.