ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఎమ్ఐఎమ్ చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పద్మావత్ చిత్ర విడుదల నేపథ్యంలో కర్ణిసేన చేపట్టిన ఆందోళన తెలిసిందే. నిరసనకారులు ఇంత చేస్తున్నా ఎందుకు ఉపేక్షిస్తోందని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
బీజేపీ పకోడా రాజకీయాలు చేస్తుందని స్పష్టంగా అర్థమౌతోంది. ప్రధాన మంత్రి, ఆయన పార్టీ నిరసనకారుల ముందు మోకరిల్లాయి. 56 ఇంచులంటూ మోదీ ముస్లింలపైనే రొమ్ము విరుస్తారే తప్ప.. వారిని(కర్ణిసేన) అదుపు చేయలేకపోతున్నారు. సిగ్గుచేటు’’ అని తెలిపారు. చివరకు న్యాయస్థానాలు జోక్యం చేసుకున్నా వారిని ఎందుకు నిలువరించలేకపోతున్నారని ప్రశ్నించిన ఒవైసీ.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రజలు భయాందోళనలో గడుపుతున్నారని చెప్పారు.
కాగా, గతంలో పద్మావత్ చిత్ర వివాదంపై స్పందించిన ఒవైసీ అది ఓ బక్వాస్(పనికిమాలిన)చిత్రం అని పేర్కొన్న విషయం తెలిసిందే. దయచేసి ఆ చిత్రం చూడకండి అంటూ ముస్లిం ప్రజానీకానికి ఆయన పిలుపు కూడా ఇచ్చారు.రాజస్థాన్, మధ్యప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం ఇంకా విడుదల కాలేదు. సినిమాలో అభ్యంతరకర దృశ్యాలు ఏమీ లేవని సినీ విశ్లేషకులు చెబుతున్నా, ఈ ఉదయం కూడా పలు ప్రాంతాల్లో విధ్వంస ఘటనలు చోటు చేసుకున్నాయి.