తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ రోజూ మోడీ మీద విరుచుకుని పడకపోతే నిద్ర పట్టడం లేదు. మరొక సారి మోడీ మీద తీవ్ర వ్యాఖ్యలు చేసారు ఆమె. ఈ సారి సోషల్ మీడియా సాక్షిగా మోడీ ని ఎండగట్టేసారు. ‘మోడీ బాబూ… మీ పుణ్యమా అని ఇంకెంతమంది ప్రాణాలు కొల్పోవాలి?’ అంటూ ఆమె ట్విట్టర్ లో ప్రశ్నించారు.
దీనిని ఆ పార్టీ ఎంపీ డెరిక్ ఓబ్రెయిన్ రీ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా పెద్ద నోట్ల రద్దు అనంతరం క్యూ లైన్లలో నిల్చుని ఇతర నగదు ఇబ్బందుల వల్ల సుమారు 95 మంది మృతి చెందారని ఆయన ఆరోపించారు. తృణమూల్ అభిమానులు మమత డెరెక్ ల ట్వీట్లను తెగ షేర్ చేస్తున్నారు.కాగా బీజేపీ పశ్చిమ్ బంగ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ మమతా బెనర్జీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది.
తమ పార్టీ అధినేత గురించి గూండాల తరహా భాష వాడారని ఆరోపిస్తూ తాము దాన్ని తేలిగ్గా తీసుకోబోవడం లేదన్నారు. పెద్ద నోట్ల రద్దును నిరసిస్తూ మమతా బెనర్జీ చేపడుతున్న ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతాయని ఆమెను ఎవరూ ఆపలేరని తృణమూల్ నేతలు సవాల్ చేస్తున్నారు.