భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డును ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ చెల్లెలు, రచయిత్రి గీతా మెహతా నిరాకరించారు. అయితే అవార్డు ప్రకటనపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. కేంద్రం ప్రభుత్వం తనకు అందివ్వాలనుకుంటున్న ఈ అవార్డును తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. న్యూయార్క్లో ఉంటున్న ఆమె దీనికి సంబంధించి ఓ ప్రెస్ స్టేట్మెంట్ను విడుదల చేశారు.
పద్మశ్రీ అవార్డుతో నన్ను గుర్తించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు. అయితే సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో అవార్డు తీసుకోవడం సరికాదని భావించి నిరాకరిస్తున్నాను. అవార్డు కారణంగా అటు ప్రభుత్వానికి, ఇటు తనకు ఇబ్బంది తలెత్తకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాను. అవార్డును నిరాకరిస్తున్నందుకు విచారం తెలియజేస్తున్నాను’ అని ఆ ప్రకటనలో గీతా మెహతా తెలిపారు.
పద్మశ్రీ అవార్డు ప్రకటించడానికి కొద్ది నెలల క్రితం గీతా మెహతా, ఆమె భర్త సోనీ మెహతా ప్రధాని మోదీని కలుసుకుని 90 నిమిషాలు మాట్లాడారని వార్తలు వచ్చాయి. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో హంగ్ ఏర్పడుతుందనే వార్తల నేపథ్యంలో …మిత్ర పక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది. ఈసారి ఒడిశా బీజేడీ ( బిజు జనతాదళ పార్టీ)తో టైఅప్ అవ్వాలని చూస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సోదరి గీత మెహతాకు పద్మశ్రీ అవార్డు ప్రకటించిందని రాజకీయవర్గాలు సమాచారం.
