హైదరాబాద్ లోని ఫిలిం చాంబర్ వద్ద ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’కు చెందిన ఓబీ వ్యాన్, ఒక కారుపై పవన్ కల్యాణ్ అభిమానులు నిన్న దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. దాడికి పాల్పడిన నిందితులను బంజారా హిల్స్ పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. ఉప్పల్ కు చెందిన భానుప్రసాద్, రామంతపూర్ చెందిన సాయి కిరణ్ రెడ్డి, చైతన్యపురికి చెందిన హరికృష్ణారెడ్డి, కూకట్ పల్లికి చెందిన అంబటి గోపి ఫణీంద్ర, కంటిపూడి రామకృష్ణను అరెస్టు చేశారు.
ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన జర్నలిస్టు సంఘాలు దాడిని ఖండిస్తూ పవన్ కు హెచ్చరికలు జారీ చేశాయి. ‘ఏబీఎన్’ వాహనాలు, ఓ కారుతో పాటు మరికొన్ని వాహనాలను పవన్ అభిమానులు ధ్వంసం చేశారు. అంతేకాకుండా ఫిలిం చాంబర్ అద్దాలను కూడా పగల గొట్టారు.
మీడియా అధినేతలు పవన్ కల్యాణ్ పై పరువు నష్టం దావాకు దిగుతున్న నేపథ్యంలో.. ఆయన కూడా చట్టపరంగా ముందుకెళ్లాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు పలు మీడియా చానెళ్లపై ఆయన కేసులు పెట్టబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. కేసులు పెట్టడమా?.. లేక పరువు నష్టం దావా వేయడమా? అన్న దానిపై ఆయన రెండు రోజులుగా న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నారు.