హైదరాబాద్: జనసేన పార్టీ పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ మొదటిసారిగా కీలక చర్యలో చేపట్టారు. మరింత బలోపేతంగా ముందుకు సాగేందుకు పార్టీలో ముఖ్యమైన నియామకాలు జరిగాయి. ఓ పక్క పవన్ కళ్యాణ్ ఏలూరులో ఇల్లు చూసుకుంటున్నా, ముందుగా తెలంగాణలో కీలక చర్యలు చేపట్టడం ఆసక్తికరంగా మారింది.
మహేందర్ రెడ్డి, వేముల శంకర్ గౌడ్లను తెలంగాణలో జనసేన ఇన్చార్జ్లుగా నియమించిన పవన్ కళ్యాణ్, సీనియర్ జర్నలిస్ట్ పీ. హరిప్రసాద్ను మీడియా హెడ్గా ప్రకటించారు.
పద్నాలుగేళ్లుగా వీరి అకుంఠిత దీక్ష, సేవా కార్యక్రమాలు, రాజకీయాల పట్ల గౌరవం చూసిన తర్వాత ఈ బాధ్యతలు అప్పగించినట్టు చెప్పారు పవన్. మహేందర్ రెడ్డి, శంకర్ గౌడ్లు వ్యాపారవేత్తలుగా ఉన్నారని చెప్పిన పవన్ వారు పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పారు. మహేందర్ రెడ్డి రంగారెడ్డి జిల్లాలోని పోచం పల్లిలో జన్మించారు. హైదరాబాద్లో వ్యాపారవేత్తగా స్థిరపడ్డారు. శంకర్ గౌడ్ హైదరాబాద్లో బోరబండ నివాసి. తాను ఏర్పాటు చేసిన కామన్ మ్యాన్ ప్రొటక్షన్ ఫోర్స్లో కూడా యాక్టీవ్గా ఉన్నారని పవన్ తెలిపారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తున్నట్టు ఈ సందర్భంగా చెప్పారు పవన్.