తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎంలు మరోసారి కలవబోతున్నారు. ఈ మేరకు భేటిని ఖరారు చేశారు. ముఖ్యంగా ఈ భేటిలో కృష్ణా, గోదావరి నదుల అనుసంధానంతోపాటు విభజన సమస్యల గురించి ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటి అవుతారని అధికార వర్గాలు చెబుతున్నాయి.
అయితే కేసీఆర్, జగన్ ల భేటి కేవలం సమస్యల మీదనే కాదని.. అంతుకుమించి రహస్య భేటి అని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రధానంగా ఏపీలోని పోలవరం, అమరావతి , విద్యుత్ పీపీఏల విషయంలో కేంద్రంలోని బీజేపీ మోకాలడ్డడం.. చంద్రబాబుకు సపోర్టుగా ఏపీ బీజేపీ నేతలు రాజకీయం చేయడాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ నజర్ పెట్టి ఇబ్బందులు పెట్టడాన్ని కేసీఆర్ గమనిస్తున్నారు. బడ్జెట్ సమావేశాల్లోనూ బీజేపీని ఎండగట్టారు.
ఈ నేపథ్యంలో ఇరువురు సీఎంలు బీజేపీ దూకుడును అడ్డుకట్ట వేసే ప్రయత్నంలోనే ఈ కీలక భేటి జరుపుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
తెలంగాణ, ఏపీలో చాపకింద నీరులా విస్తరిస్తున్న బీజేపీని ఎలా ఎదుర్కోవాలి..? ఆ పార్టీ రెండు రాష్ట్రాల్లో వ్యవహరిస్తున్న తీరును ఎలా కలిసి ఎండగట్టాలనే దానిపై ఇద్దరు సీఎంలు ఈ కీలక భేటి జరుపుతున్నారని ప్రచారం జరుగుతోంది.
రెండు రాష్ట్రాల సమస్యలతోపాటు ప్రధానంగా బీజేపీని ఎదుర్కోవడంపైనే ఇద్దరు సీఎంలు ఈ భేటి జరుపుతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీని ఎదుర్కోవడం చాలా కష్టం.. అలా అని సైలెంట్ గా ఉంటే రాజకీయంగా నష్టం.. అందుకే ఈ విషయంలో ఎలా ముందుకెళ్లాలనే దానిపైనే జగన్ అండ్ కేసీఆర్ ఈ కీలక భేటి జరుపుతున్నట్టు అర్థమవుతోందని పరిశీలకులు చెబుతున్నారు.