తమిళనాట అధికార పీఠాన్ని దక్కించుకోవాలని ఊవిళ్లూరుతున్న ద్రవిడ మున్నేట్ర కళగం(డీఎంకే) కీలక నిర్ణయం తీసుకుంది. అసదుద్దీన్ నేతృత్వంలోని ఏఐఎంఐఎం పార్టీని తమ కూటమిలోకి ఆహ్వానించడంపై వెనక్కి తగ్గింది. ప్రస్తుతం ఉన్న పార్టీలతో తప్ప మరే ఇతర పక్షాలను కూటమిలో కలుపుకోవటం లేదని చెప్పినట్లు తెలుస్తోంది.
నూతన సంవత్సరం తొలిరోజున అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎంను.. డీఎంకే మైనారిటీ విభాగ అధ్యక్షుడు డాక్టర్ మస్తాన్.. కూటమిలోకి ఆహ్వానించారు. దీనిపై ఎంఐఎం కూడా సానుకూలంగా స్పందించింది. అయితే.. ఈ విషయమై ముస్లిం పార్టీల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలోనే ఓవైసీని ఆహ్వానించడంపై డీఎంకే వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
డీఎంకే మిత్రపక్షాలైన ఐయూఎంఎల్, ఇండియన్ నేషనల్ లీగ్(ఐఎన్ఎల్) పార్టీలు.. ఓవైసీతో చేతులు కలపడంపై అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఎంఐఎం చేరికతో.. ఓట్లు చీలిపోతాయని భావించాయి. దీనిపై డీఎంకే అధినేత స్టాలిన్తో సమావేశం కావాలని ప్రయత్నించినట్లు ఐఎన్ఎల్ తెలిపింది.