తెలుగు సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో ముందడుగు పడినట్టు తెలుస్తోంది. ఈ కేసులో భాగంగా తొలి చార్జ్షీటు దాఖలైంది. ఈ కేసులో అకున్ సబార్వాల్ నేతృత్వంలోని సిట్ 10 మంది టాలీవుడ్ ప్రముఖ నటులు, నటీమణులు, దర్శకులను విచారణ చేపట్టారు. అప్పట్లో దూకుడుగా ఉన్న అధికారులు ఆ తర్వాత సైలెంటయ్యారు. ఇప్పుడు ఆ కేసులో పురోగమనం కనిపించింది.
డ్రగ్స్ తీసుకున్నారు అని ఆరోపణలు ఎదుర్కొంటున్న దర్శకుడు పూరీ జగన్నాథ్, నటులు రవితేజ, తరుణ్, నవదీప్, నందు, తనీశ్, సుబ్బరాజు, శ్యాం కే నాయుడు, హీరోయిన్లు ఛార్మి, ముమైత్ఖాన్ తదితరులను విచారణ చేశారు. హైదరాబాద్లో వీరిని విచారించి వీరిలో ముగ్గురి నుంచి రక్తం, గోళ్లు, వెంట్రుకల నమూనాలను తీసుకుని ఫోరెన్సిక్ పరిశీలనకు పంపారు.
తాజాగా ఫోరెన్సిక్ నివేదిక అందడంతో ముగ్గురు వ్యక్తులపై సిట్ చార్జ్షీటును దాఖలు చేసింది. మరికొందరికి సంబంధించిన ఫోరెన్సిక్ నివేదిక ఇంకా రావాలని సిట్ అధికారి అకున్ సబర్వాల్ తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.