ప్రముఖ సినీనటి శ్రీదేవి అంత్యక్రియలు ముగిశాయి. దుబాయ్లో హఠాన్మరణం చెందిన శ్రీదేవి అంతిమ సంస్కారాలు ముంబై విల్లేపార్లేలోని సేవా సమాజ్ శ్మశాన వాటికలో మహారాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. ఆమె పార్థీవ దేహంపైన త్రివర్ణ పతాకం ఉంచారు. ఆమెకు ఎంతో ఇష్టమైన శ్వేత వర్ణంలోనే అంతిమ యాత్ర వాహనాన్ని ముస్తాబు చేశారు.
బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు అంతిమ యాత్రలో పాల్గొన్నారు. అశ్రునయనాల మధ్య ఆమెకు తుది వీడ్కోలు పలికారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన శ్రీదేవి అంతిమ యాత్ర ఏడు కిలోమీటర్ల మేర సాగింది. మరోవైపు తమ అభిమాన నటిని కడసారి చూపు కోసం అభిమానులు శ్మశానవాటిక వద్దకు పోటెత్తారు.
అంతిమ సంస్కారం సందర్భంగా శ్రీదేవిని… ఆమెకు ఎంతో ఇష్టమైన ఎరుపు రంగు చీర కంచిపట్టు చీరతో అలంకరించారు. ఎప్పుడూ అందంగా కనిపించడం ఆమెకి అలవాటు. చివరిక్షణాల్లోనూ శ్రీదేవిని అలాగే తయారు చేశారు. అభిమానుల మనసుల్లో నుంచి ఆ మనోహర రూపం చెదిరిపోకుండా ఉండేలా ఆమె కుటుంబసభ్యులు చర్యలు తీసుకున్నారు. శ్రీదేవి భౌతికకాయాన్ని ఉంచిన వాహనాన్ని మల్లెపూలు, లిల్లీపూలతో అలంకరించారు.
మరోవైపు విల్లేపార్లేలోని సేవా సమాజ్ శ్మశాన వాటికలో జరిగిన అంత్యక్రియల కార్యక్రమంలో సినీ నటులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.నటి విద్యాబాలన్, ఆమె భర్త సిద్ధార్థ్ రాయ్ కపూర్, ఫర్హాన్ అక్తర్, దియా మిర్జా, ఆమె భర్త సాహిల్, అనిల్ అంబానీ, అనుపమ్ ఖేర్, అర్జున్ రాంపాల్ తదితరులు హాజరయ్యారు.
దీంతో దివి నుంచి భువికి దిగి వచ్చి, దశాబ్దాలపాటు వెండితెరను రాణిలా ఏలిన అతిలోక సుందరి మళ్లీ దివికి వెళ్లిపోయింది. మరపురాని పాత్రలతో అర్థ శతాబ్దం పాటు అశేష అభిమానగణాన్ని అలరించి, కోట్లాది హృదయాల్లో శాశ్వత ముద్ర వేసుకున్న ఆమె… మానవా ఇక సెలవ్ అంటూ స్వర్గానికి సాగిపోయింది.