ప్రపంచ క్రికెట్ చరిత్రలో శ్రీలంక మాజీ బ్యాట్స్ మెన్ సనత్ జయసూర్యది ప్రత్యేకం అనే చెప్పాలి. వన్డే క్రికెట్ కు దూకుడు నేర్పిన క్రికెటర్లలో అతను ఒకడు. అలాంటి క్రికెట్ దిగ్గజంపై ఇప్పుడు స్మగ్లింగ్ ఆరోపణల్లో చిక్కుకున్నారు. ఆయనతో పాటు మరో ఇద్దరు క్రికెటర్లు కూడా స్మగ్లింగ్ కేసులో ఇరుక్కున్నారు.
వివరాల్లోకి వెల్తే…. శ్రీలంక నుంచి దిగుమతి అయిన కోట్ల విలువైన వక్కలను నాగ్ పూర్ లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సీజ్ చేసింది. ఈ అక్రమ దందాలో జయసూర్య పేరు వెలుగులోకి వచ్చిందని దైనిక్ భాస్కర్ ఆ కథనం పేర్కొంది. ఈ వ్యవహారానికి సంబంధించి విచారించేందుకు జయసూర్యను రెవిన్యూ ఇంటెలిజెన్స్ బృందం ముంబైకి పిలిపించినట్టు సమాచారం.
జయసూర్యతో పాటు మరో ఇద్దరు క్రికెటర్లు కూడా ఈ స్మగ్లింగ్ లో పాలుపంచుకున్నట్టు పేర్కొంది. అయితే మిగిలిన ఇద్దరి పేర్లు ఇంకా బయటకు రాలేదు. వీరందరినీ డిసెంబర్ 2న విచారణకు పిలిచే అవకాశం ఉంది. మరోవైపు, ఇప్పటికే విచారణ కోసం జయసూర్య ఒకసారి ముంబై వచ్చినట్టు తెలుస్తోంది.
ఇండోనేషియా నుంచి శ్రీలంకకు తరలించిన వక్కలను తర్వాత వారు భారత్కు చేరవేస్తున్నారని రెవిన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు వెల్లడించారు. తమకున్న పలుకు బడిని ఉపయోగించుకొని డమ్మీ కంపెనీలను ఏర్పాటు చేసుకని ఈ స్మగ్లింగ్కు పాల్పడుతున్నట్లు రెవిన్యూ ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి.
దక్షిణాసియా స్వేచ్ఛా వర్తక ప్రాంత చట్టాన్ని ఆసరాగా చేసుకుని మాజీ క్రికెటర్లు డమ్మీ కంపెనీలతో అక్రమ లావాదేవీలు సాగించినట్టు సమాచారం. ఈ చట్టం ప్రకారం భారత్, శ్రీలంకల మధ్య దేశీయంగా రూపొందే ఉత్పత్తుల పన్ను రహిత రవాణాకు అనుమతిస్తారు.