దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషులకు సుప్రీం కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. గతంలో ఢిల్లీ హైకోర్టు మరణశిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు శుక్రవారం సమర్థించింది. నిందితుల అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఢిల్లీ నిర్భయ ఘటనలో నిందితులు బాధితురాలి పట్ల అత్యంత హేయంగా ప్రవర్తించారని, వారిపై ఎలాంటి సానుభూతి చూపలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. దీంతో నిర్భయ హత్యాచారం కేసులో దోషులైన ముఖేష్, వినయ్, అక్షయ్, పవన్లకు ఉరిశిక్ష అమలు కానుంది.
2012 డిసెంబర్ 16వ తేదీ రాత్రి నిర్భయ మీద అత్యాచారం జరిగినప్పుడు ఆ బస్సులో ఈ నలుగురితోపాటు మరో ఇద్దరు కూడా ఉన్నారు. వీరంతా కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడటంతోపాటు ఆమెను చిత్రహింసలకు గురిచేశారు. కాగా, దోషుల్లో ఒకరైన రామ్ సింగ్ తీహర్ జైల్లో 2013 మార్చిలో ఆత్మహత్య చేసుకోగా, మరో నిందితుడు మైనర్ కావడంతో కేవలం మూడేళ్ల శిక్ష అనుభవించి స్వేచ్ఛగా బయటకు వెళ్లిపోయాడు. దీనిపై కూడా దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. దీంతో ఇప్పుడు బాలనేరస్తుల చట్టాన్ని కూడా సవరించారు.
కాగా, అతడిపై తీవ్రంగా దాడి చేసిన ఈ ఆరుగురు దోషులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడి చిత్ర హింసలకు గురిచేశారు. ఇనుపరాడ్లతో ఆమె శరీరాన్ని ఛిద్రం చేశారు. ఆ తర్వాత నగ్నంగా రోడ్డుపై పడేసి పరారయ్యారు. కాగా, ఆమె కొద్ది రోజులకే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. దీనిని అత్యంత అరుదైన కేసుగా ధర్మాసనంలోని ముగ్గురు న్యాయమూర్తులు అభివర్ణించారు.
కోర్టు రూమ్లో ఉన్న లాయర్లు, నిర్భయ తల్లిదండ్రులు చప్పట్లతో ఈ తీర్పును స్వాగతించారు. ఈ కేసు తీవ్రతను చూస్తే ఉరి శిక్ష తప్ప ఏ శిక్ష విధించినా తక్కువే అని ఈ సందర్భంగా జస్టిస్ దీపక్ మిశ్రా అన్నారు. జస్టిస్ దీపక్ మిశ్రా, ఆర్. భానుమతి, అశోక్ భూషన్లతో కూడిన ధర్మాసనం తీర్పును ప్రకటించింది. సుప్రీంకోర్టు తీర్పు పట్ల నిర్భయ తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే. నిందితులు మరోసారి రివ్యూ పిటిషన్ వేసే అవకాశముంది. లేదంటే రాష్ట్రపతికి క్షమాభిక్ష కోరుతూ విన్నవించుకునే అవకాశం ఉంది. అయితే ఈ దారుణమైన కేసులో మాత్రం రాష్ట్రపతి కూడా వీరికి క్షమాభిక్ష పెట్టే అవకాశం దాదాపు లేదనే చెప్పవచ్చు.
Related